ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- ప్రభాకర్రావును ఇప్పటికే రెండు వారాల కస్టడీకి ఇచ్చామన్న ధర్మాసనం
- ఇంకెంత కాలం విచారిస్తారని ప్రశ్న
- దర్యాప్తుకు ప్రభాకర్ రావు సహకరిస్తారని వ్యాఖ్య
ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్రావు విచారణపై దర్యాప్తు సంస్థను ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పటికే రెండు వారాల కస్టడీకి అనుమతి ఇచ్చామని గుర్తు చేస్తూ.. ఇంకెంత కాలం ఇంటరాగేషన్ కొనసాగిస్తారు? ఈ కేసులో ఇంకా ఏం మిగిలుంది? అంటూ స్పష్టమైన ప్రశ్నలు సంధించింది.
ప్రభాకర్రావు ఇంటరాగేషన్ను పూర్తిచేయాలని ఆదేశించిన కోర్టు.. మీ ఉద్దేశం పూర్తయిందా? లేదా? మళ్లీ ఆయన్ని జైలుకు పంపాలనుకుంటున్నారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ముందస్తు బెయిల్ ఇచ్చినంత మాత్రాన ఆయనను విచారణకు పిలవకూడదని కాదని స్పష్టం చేసింది. అవసరమైతే మళ్లీ పిలిచి విచారణ చేయవచ్చని, ప్రభాకర్రావు దర్యాప్తుకు సహకరిస్తారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
కేసు దర్యాప్తును దృష్టిలో ఉంచుకొని ఆర్టికల్ 142 కింద మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్లు కోర్టు వెల్లడించింది. తదుపరి విచారణ వరకు ప్రభాకర్రావుకు ఇచ్చిన మధ్యంతర రక్షణను పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు.