కదిలే లక్ష్యాన్ని ఛేదించే యాంటీ టాంక్ మిస్పైల్... డీఆర్డీవోకు రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు

Rajnath Singh Congratulates DRDO on Anti Tank Missile Test
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. మూడో తరానికి చెందిన మ్యాన్ పోర్టబుల్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ (MPATGM)ను విజయవంతంగా పరీక్షించింది. కదులుతున్న లక్ష్యాన్ని సైతం అత్యంత కచ్చితత్వంతో ఛేదించే ఈ క్షిపణి పరీక్ష విజయవంతం కావడం పట్ల కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్డీవో బృందాన్ని, పరిశ్రమ వర్గాలను అభినందించారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని ఆయన అభివర్ణించారు.

మహారాష్ట్రలోని అహిల్య నగర్‌లోని కేకే రేంజెస్‌లో ఈ పరీక్షను నిర్వహించారు. హైదరాబాద్‌లోని డీఆర్డీవో ల్యాబొరేటరీ అభివృద్ధి చేసిన ఈ క్షిపణి, నిర్దేశిత కదిలే లక్ష్యాన్ని విజయవంతంగా ధ్వంసం చేసింది. ఈ విజయంతో ఈ ఆయుధ వ్యవస్థను భారత సైన్యంలోకి ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమమైందని డీఆర్డీవో ఛైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ తెలిపారు.

పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణిలో అత్యాధునిక టెక్నాలజీలు ఉన్నాయి. ఇందులో ఉండే ఇమేజింగ్ ఇన్‌ఫ్రారెడ్ (IIR) హోమింగ్ సీకర్ సహాయంతో పగలు, రాత్రి వేళల్లోనూ శత్రు ట్యాంకులను గుర్తించి నాశనం చేయగలదు. ట్యాంకు పైభాగంలో దాడి చేసే 'టాప్ ఎటాక్' సామర్థ్యం, ఆధునిక యుద్ధ ట్యాంకులను సైతం ధ్వంసం చేయగల టెన్డం వార్‌హెడ్ దీని ప్రత్యేకతలు. ఈ క్షిపణిని ట్రైపాడ్ పైనుంచి లేదా సైనిక వాహనం నుంచి ప్రయోగించవచ్చు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఈ ఆయుధ వ్యవస్థ అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నాయి.
Go Back to Shorts
Rajnath Singh
DRDO
MPATGM
anti tank missile
defence research
Indian army
Atmanirbhar Bharat
missile test
समीर वी कामत
Bharat Dynamics Limited

More Telugu News