విరాట్ కోహ్లీ ఖాతాలో మరో ఘనత... సంగక్కర రికార్డు అధిగమించిన కింగ్

  • అంతర్జాతీయ క్రికెట్‌లో రెండో అత్యధిక పరుగుల వీరుడిగా కోహ్లీ
  • శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కరను వెనక్కినెట్టిన విరాట్
  • ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్న సచిన్ టెండూల్కర్ 
  • అత్యంత వేగంగా 28,000 పరుగులు పూర్తి చేసి కోహ్లీ మరో రికార్డు
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజ ఆటగాడు కుమార సంగక్కరను అధిగమించాడు. ఈ జాబితాలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మాత్రమే కోహ్లీ కన్నా ముందున్నాడు.

ఆదివారం వడోదరలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు. మ్యాచ్‌లో భాగంగా 20వ ఓవర్ ఐదో బంతికి తన 42వ పరుగు పూర్తి చేసినప్పుడు, సంగక్కర పేరిట ఉన్న 28,016 పరుగుల రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. సంగక్కర 594 మ్యాచ్‌లలో ఈ పరుగులు సాధించగా, కోహ్లీ మరింత వేగంగా ఈ ఘనతను చేరుకున్నాడు.

ఇదే మ్యాచ్‌లో కోహ్లీ మరో రికార్డును కూడా సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 28,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. కోహ్లీ కేవలం 624 ఇన్నింగ్స్‌లలోనే ఈ మార్కును చేరుకోగా, గతంలో ఈ రికార్డు సచిన్ (644 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండేది.

ఈ మ్యాచ్‌కు ముందు 28,000 పరుగులకు 25 పరుగుల దూరంలో ఉన్న కోహ్లీ, 13వ ఓవర్లో బౌండరీతో ఆ మైలురాయిని దాటాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డు 34,357 పరుగులతో సచిన్ టెండూల్కర్ పేరు మీదే అగ్రస్థానంలో ఉంది.


More Telugu News