న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు రిషభ్ పంత్ దూరం.. భారత్‌కు భారీ షాక్!

  • నెట్స్ లో బ్యాటింగ్ చేస్తుండగా పక్కటెముకల పైభాగంలో గాయం
  • కుడివైపు సైడ్ స్ట్రెయిన్ కారణంగా సిరీస్ మొత్తానికి పంత్ దూరం
  • బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చికిత్స
  • పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ లేదా ఇషాన్ కిషన్‌లలో ఒకరికి అవకాశం!
న్యూజిలాండ్‌తో జరగనున్న తొలి వన్డేకు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ గాయం కారణంగా వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. వడోదరలోని బీసీఏ మైదానంలో జరిగిన ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్‌లో పంత్ సుమారు 50 నిమిషాల పాటు బ్యాటింగ్ చేశాడు. అయితే, త్రోడౌన్ స్పెషలిస్ట్ విసిరిన బంతి పంత్ నడుము పైభాగంలో బలంగా తగిలింది. దీంతో తీవ్రమైన నొప్పితో విలవిల్లాడిన పంత్ వెంటనే నెట్స్ నుంచి వైదొలిగాడు. టీమ్ డాక్టర్ పర్యవేక్షణలో నిర్వహించిన స్కానింగ్ రిపోర్టులలో పక్కటెముకల వద్ద గాయంతో పాటు 'సైడ్ స్ట్రెయిన్' ఉన్నట్లు తేలింది. దీంతో అతడు సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉండడని వైద్య బృందం స్పష్టం చేసింది.

గతేడాది ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో పంత్ కుడి కాలు ఫ్రాక్చర్ కాగా, కోలుకున్న తర్వాత నవంబర్‌లో దక్షిణాఫ్రికాపై పునరాగమనం చేశాడు. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరపున రెండు హాఫ్ సెంచరీలు బాది మంచి ఫామ్‌లో ఉన్న తరుణంలో మరోసారి గాయపడటం గమనార్హం. 2024 ఆగస్టులో శ్రీలంక పర్యటన తర్వాత పంత్ వన్డేలు ఆడలేదు.

పంత్ దూరం కావడంతో అతడి స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనే దానిపై జట్టు మేనేజ్‌మెంట్ కసరత్తు చేస్తోంది. విజయ్ హజారే ట్రోఫీలో రాణించిన ధ్రువ్ జురెల్ లేదా ఇషాన్ కిషన్‌లలో ఒకరు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే నేడు (ఆదివారం) వడోదరలో ప్రారంభం కానుండగా, జనవరి 14న రాజ్‌కోట్‌లో రెండో వన్డే, 18న ఇండోర్‌లో చివరి వన్డే జరగనున్నాయి.


More Telugu News