కోనసీమ గ్యాస్ లీక్‌పై సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే

Chandrababu Naidu Conducts Aerial Survey of Konaseema Gas Leak
కోనసీమ జిల్లా, ఇరుసుమండ గ్రామంలోని ఓఎన్జీసీ బావి వద్ద ఐదో రోజు కూడా మంటలు కొనసాగుతుండటంతో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. గ్యాస్ బావి నుంచి ఎగిసిపడుతున్న మంటలను, పరిసర ప్రాంతాల్లోని పరిస్థితిని ఆయన గగనతలం నుంచి పరిశీలించారు.

అనంతరం మండపేట నియోజకవర్గంలోని రాయవరంలో ఆయన ఓఎన్జీసీ అధికారులు, కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్, ఎంపీ హరీశ్ బాలయోగి, ఎమ్మెల్యే వరప్రసాద్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీసుకుంటున్న చర్యల గురించి సీఎం ఆరా తీశారు. మంటల వల్ల దెబ్బతిన్న కొబ్బరి చెట్లకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మరోవైపు, బ్లోఅవుట్‌ను అదుపులోకి తెచ్చేందుకు ఆమోదించిన ప్రణాళిక ప్రకారం ముమ్మరంగా పనిచేస్తున్నామని ఓఎన్జీసీ ఒక ప్రకటనలో తెలిపింది. సంక్షోభ నిర్వహణ బృందం (CMT) ఇప్పటికే బావి పరిసరాల్లోని శిథిలాలను చాలావరకు తొలగించి, బావి హెడ్ వద్దకు వెళ్లేందుకు మార్గం సుగమం చేసింది. బావిని క్యాపింగ్ చేసే దిశగా ఆపరేషన్ కొనసాగించేందుకు అడ్డంకిగా ఉన్న మాస్ట్, ఇతర పరికరాల భాగాలను తొలగించినట్లు పేర్కొంది. బావి హెడ్ సమీపంలో సురక్షితంగా పనిచేసేందుకు వీలుగా నిరంతరం నీటిని చల్లుతున్నామని వివరించింది.

ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉండటంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తమ సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు. కాగా, సోమవారం మధ్యాహ్నం మరమ్మతు పనులు చేస్తుండగా ఈ బావి నుంచి అకస్మాత్తుగా ముడిచమురుతో కూడిన గ్యాస్ భారీగా ఎగిసిపడిన విషయం తెలిసిందే. దీంతో ఇరుసుమండ, పరిసర గ్రామాల్లో దట్టమైన పొగ, గ్యాస్ వ్యాపించి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Konaseema gas leak
Andhra Pradesh
ONGC
Irusumanda village
Aerial survey
Gas well fire
Compensation
Harish Balayogi
Varaprasad

More Telugu News