ట్రంప్‌ కు మోదీ ఫోన్ చేస్తే డీల్ ఓకే అవుతుంది... కానీ మోదీ నిరాకరిస్తున్నారు: అమెరికా మంత్రి కీలక వ్యాఖ్యలు

  • ట్రంప్‌తో మోదీ నేరుగా మాట్లాడేందుకు నిరాకరించడం వల్లే ట్రేడ్ డీల్ ఆలస్యమన్న హోవార్డ్
  • బ్రిటన్ ప్రధాని అదే రోజు మాట్లాడటంతో డీల్ పూర్తయిందని వెల్లడి
  • మోదీ ఫోన్ చేయడానికి నిరాకరించినప్పటికీ ఇంకా అవకాశం ఉందన్న హోవార్డ్
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ చేయకపోవడం వల్లే భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదరలేదని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్-అమెరికా ట్రేడ్ డీల్ చర్చల సమయంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కార్యరూపం దాల్చకపోవడానికి విధానపరమైన అడ్డంకులు కారణం కాదని ఆయన స్పష్టం చేశారు.

అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ నేరుగా మాట్లాడేందుకు నిరాకరించడమే అసలు కారణమని ఆయన పేర్కొన్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై అసంతృప్తిగా ఉన్నానని, ఢిల్లీపై అధిక సుంకాలు విధిస్తామని ట్రంప్ చేసిన వ్యాఖ్యల అనంతరం అమెరికా వాణిజ్య శాఖ మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

మామూలుగా అయితే ఒప్పందం కొలిక్కి వచ్చిందని, ఇది ట్రంప్ ఒప్పందమని చెప్పవచ్చునని ఆయన అన్నారు. దానికి ముగింపు రావాలంటే ట్రంప్‌నకు మోదీ ఫోన్ చేయాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఇది భారత ప్రభుత్వానికి రుచించలేదని, మోదీ ఫోన్ కూడా చేయలేదని ఆయన తెలిపారు.

ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, వియత్నాంతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నామని, వాటి కంటే భారత్‌తోనే ముందు ఒప్పందం ఖరారవుతుందని భావించామని ఆయన అన్నారు. అలా జరగకపోవడంతో ఇంతకుముందు అంగీకరించిన వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా వెనక్కి తీసుకుందని, ప్రస్తుతం దానిపై ఆలోచన చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు.

బ్రిటన్‌తో వాణిజ్య ఒప్పందం చర్చలు కొలిక్కి వస్తోన్న సమయంలో ఆ దేశ ప్రధాని కీర్‌స్మార్టర్ ట్రంప్‌నకు ఫోన్ చేశారని ఆయన గుర్తు చేశారు. దాంతో అదే రోజు డీల్ ముగిసిందని, మరుసటి రోజు ఇరువురు నేతలు మీడియా సమావేశంలో ప్రకటన చేశారని తెలిపారు. మోదీ ఫోన్ చేయడానికి నిరాకరించినప్పటికీ, ఇంకా ఫోన్ చేయడానికి ఆయనకు అవకాశం ఉందని హోవార్డ్ లుట్నిక్ పేర్కొన్నారు.


More Telugu News