బిచ్చగాడు అనుకుంటే లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం

  • కేరళలో రోడ్డు ప్రమాదంలో ఓ బిచ్చగాడి మృతి
  • మృతుడి వద్ద రూ.4.5 లక్షలకు పైగా నగదు లభ్యం
  • డబ్బాలో రద్దయిన రూ.2000 నోట్లు, విదేశీ కరెన్సీ కూడా
  • తిండి ఖర్చుల కోసం అడుక్కునేవాడని స్థానికుల వెల్లడి
  • డబ్బును కోర్టుకు అప్పగిస్తామని తెలిపిన పోలీసులు
కేరళలోని అలప్పుజలో ఓ విచిత్ర ఘటన వెలుగు చూసింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ బిచ్చగాడి వద్ద ఏకంగా రూ.4.5 లక్షలకు పైగా నగదు లభ్యం కావడంతో స్థానికులు, అధికారులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే... చారుమ్మూడ్ ప్రాంతంలో అనిల్ కిషోర్ అనే వ్యక్తి భిక్షాటన చేస్తూ జీవించేవాడు. సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడు గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఎవరికీ ఏమీ చెప్పకుండా అతడు ఆసుపత్రి నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం ఓ దుకాణం ముందు విగతజీవిగా కనిపించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, అతడి సమీపంలో దొరికిన ఓ కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పంచాయతీ సభ్యుడు ఫిలిప్ ఉమ్మన్ సమక్షంలో ఆ కంటైనర్‌ను తెరిచి చూడగా, అధికారులు నివ్వెరపోయారు. అందులో ప్లాస్టిక్ డబ్బాల్లో నింపిన కరెన్సీ నోట్ల కట్టలు ఉన్నాయి. మొత్తం రూ.4.5 లక్షలకు పైగా నగదుతో పాటు రద్దయిన రూ.2000 నోట్లు, విదేశీ కరెన్సీ కూడా ఉన్నట్టు గుర్తించారు.

రోజూ తిండి ఖర్చుల కోసం అడుక్కునే అనిల్ వద్ద ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఉండటం తమను షాక్‌కు గురిచేసిందని పంచాయతీ సభ్యుడు తెలిపారు. అతడి దగ్గర అంత డబ్బు ఉందని ఎవరూ ఊహించలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ నగదును కోర్టుకు అప్పగిస్తామని, అతడి కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చినా రాకపోయినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.


More Telugu News