విజయ్ 'జన నాయగన్' మూవీ విడుదల వాయిదా

  • జన నాయగన్ మూవీకి ధ్రువీకరణ పత్రం జారీ చేయని సెన్సార్‌ బోర్డు 
  • హైకోర్టును ఆశ్రయించిన చిత్ర నిర్మాణ సంస్థ 
  • సంక్రాంతి సందర్భంగా ఈ నెల 9న విడుదల కావాల్సిన జన నాయగన్ 
  • జనవరి 9న కోర్టు ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉండటంతో రిలీజ్‌ను వాయిదా వేసినట్లు ప్రకటన
రాజకీయ రంగ ప్రవేశం చేసిన అనంతరం తమిళ స్టార్‌ హీరో విజయ్‌ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్‌’ విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల చేయాలని చిత్ర నిర్మాణ సంస్థ భావించింది. అయితే, సెన్సార్‌ బోర్డు నుంచి ధ్రువీకరణ పత్రం అందకపోవడంతో చిత్ర బృందం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. చిత్రం సెన్సార్ ధ్రువీకరణ, విడుదలపై జనవరి 9న కోర్టు నుంచి తుది ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉండటంతో విడుదలను వాయిదా వేయాలని చిత్ర నిర్మాణ సంస్థ నిర్ణయించింది.

విడుదలకు సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘జన నాయకుడు’ పేరుతో విడుదల చేయనున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్‌కు ఇదే చివరి చిత్రం కావడం విశేషం. 


More Telugu News