: డ్రగ్స్ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు

  • డ్రగ్స్ కేసులో అమన్ ప్రీత్ సింగ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
  • విక్రేతల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు మాసాబ్ ట్యాంక్ పీఎస్‌లో కేసు నమోదు
  • కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అమన్ పిటిషన్
మాసాబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ హైకోర్టును ఆశ్రయించాడు. డ్రగ్స్ కేసులో అతడిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విక్రేతల నుంచి డ్రగ్స్‌ను కొనుగోలు చేసినట్లు కేసు నమోదైంది.

నాటి నుంచి అమన్ పరారీలో ఉన్నాడు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది.

గత ఏడాది డిసెంబర్ 19న హైదరాబాద్‌లోని మాసాబ్ ట్యాంక్ పరిధిలో పోలీసులు జరిపిన డ్రగ్స్ దాడుల్లో కొకైన్, ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పట్టుబడిన నిందితులను విచారించగా అమన్ ప్రీత్ సింగ్ పేరు వెలుగుచూసింది. నెల రోజుల వ్యవధిలో అమన్ ఆరుసార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

More Telugu News