వెనెజువెలా సంక్షోభం... భారత్‌కు మేలు చేస్తుందంటున్న నిపుణులు!

Venezuela Crisis Benefits India Experts Say
షార్ట్స్‌లో చూడండి
అమెరికా, వెనెజువెలా మధ్య కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారతదేశంపై తక్షణ ప్రభావం చూపబోవని, ప్రస్తుత పరిస్థితుల్లో భారత దేశ చమురు దిగుమతి వ్యయం పెరిగే అవకాశం లేదని మంగళవారం విడుదలైన ఒక నివేదిక స్పష్టం చేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం, ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు సరఫరా అవసరానికి మించి (గ్లట్ మోడ్) ఉండటం, అంతర్జాతీయ ఉత్పత్తిలో వెనెజువెలా వాటా కేవలం 1 శాతం మాత్రమే కావడం ఇందుకు ప్రధాన కారణాలు. అందువల్ల, వెనెజువెలాలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నా, భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నివేదిక భరోసా ఇచ్చింది.

వెనెజువెలాలో నిరూపితమైన చమురు నిల్వలు చాలా ఎక్కువని, ప్రపంచ మొత్తం నిల్వల్లో దాదాపు 19.4 శాతం అక్కడే ఉన్నాయని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక పేర్కొంది. ఈ భారీ నిల్వలను వెలికితీసి, సరఫరా పెంచేందుకు అమెరికా కంపెనీలు రంగంలోకి దిగవచ్చన్న మార్కెట్ అంచనాలతో ఇప్పటికే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. ఈ పరిణామం భారత్‌కు మేలు చేసే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు.

"ప్రస్తుత ప్రపంచ సరఫరా పరిస్థితులు, మిగులు నిల్వలను పరిగణనలోకి తీసుకుంటే, సమీప భవిష్యత్తులో భారత్ ఆయిల్ దిగుమతి బిల్లు పెరిగే ప్రమాదం కనిపించడం లేదు" అని నివేదికలో స్పష్టం చేశారు. ఒకవేళ అమెరికా కంపెనీలు వెనెజువెలాలో ఉత్పత్తిని పెంచితే, అంతర్జాతీయంగా ధరలు మరింత తగ్గి, భారత్ సహా అన్ని దేశాలకూ లబ్ధి చేకూరుతుందని మరో నివేదికలో విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

భారత్-వెనెజువెలా వాణిజ్య సంబంధాలు

భారత్, వెనెజువెలా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుతం 1.9 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో భారత్ నుంచి ఎగుమతులు 217 మిలియన్ డాలర్లు కాగా, దిగుమతులు 1.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ దిగుమతుల్లో పెట్రోలియం, ఆయిల్, లూబ్రికెంట్స్ (POL) వాటానే అత్యధికం. "భారత్ దిగుమతి చేసుకుంటున్న దేశాలతో పోలిస్తే వెనెజువెలా నుంచి వస్తున్న ముడి చమురు యూనిట్ విలువ తక్కువగా ఉంది. ఇది మన దిగుమతి ఖర్చులను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది" అని బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థికవేత్త దీపాన్వితా మజుందార్ వివరించారు.

అయితే, గత ఐదేళ్లుగా వెనెజువెలాకు భారత ఎగుమతులు సగటున ఏటా 8.8 శాతం మేర క్షీణిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రపంచానికి భారత్ చేస్తున్న మొత్తం ఎగుమతులు 6.9 శాతం వృద్ధి చెందాయి. దీన్నిబట్టి వెనెజువెలాతో వాణిజ్య సంబంధాలు మందగించాయని అర్థమవుతోంది. 

వెనెజువెలా నుంచి ముడి చమురును అధికంగా ఎగుమతి చేసుకుంటున్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత చైనా, భారత్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొనసాగుతున్న చర్చల్లో చమురు దౌత్యం కీలక పాత్ర పోషిస్తోంది. 

కాగా, ఈ ప్రాంతంలోని భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా వెనెజువెలాలో భారీ పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు వెనకడుగు వేయవచ్చని, ఇది చమురు ఉత్పత్తి పెంపునకు అడ్డంకిగా మారవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Go Back to Shorts
Venezuela Crisis
India
Venezuela
Oil Imports
Crude Oil
Bank of Baroda
Oil Prices
Geopolitics
Deepanwita Majumdar

More Telugu News