'భారత్ ట్యాక్సీ'కి భలే గిరాకీ... రోజుకు 45 వేల మంది కొత్త యూజర్లు!

Bharat Taxi App Sees Huge Demand with 45000 New Users Daily
షార్ట్స్‌లో చూడండి
దేశీయ రైడ్-హెయిలింగ్ మార్కెట్‌లో ఓలా, ఊబర్ వంటి దిగ్గజ సంస్థలకు గట్టిపోటీ ఇచ్చేందుకు ప్రభుత్వ మద్దతుతో కొత్త క్యాబ్ సర్వీస్ యాప్ వచ్చేసింది. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ సహకారంతో ప్రారంభమైన 'భారత్ ట్యాక్సీ' యాప్‌కు వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఈ యాప్‌కు భారీ ఆదరణ దక్కుతుండటం విశేషం.

గత రెండు రోజులుగా ప్రతిరోజూ సుమారు 40,000 నుంచి 45,000 మంది కొత్త యూజర్లు ఈ యాప్‌లో రిజిస్టర్ చేసుకుంటున్నారని కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో తెలిపింది. ఇప్పటికే మొత్తం రిజిస్టర్డ్ కస్టమర్ల సంఖ్య 4 లక్షలు దాటిందని పేర్కొంది. ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో 9వ స్థానంలో, యాపిల్ యాప్ స్టోర్‌లో 13వ స్థానంలో ట్రెండ్ అవుతోంది.

కేంద్ర మంత్రి అమిత్ షా నేతృత్వంలోని 'ఆత్మనిర్భర్ భారత్', 'సహకార్ సే సమృద్ధి' దార్శనికతలో భాగంగా ఈ యాప్‌ను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పోలీస్ వెరిఫైడ్ డ్రైవర్లు, మెరుగైన భద్రతా ఫీచర్లతో ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యమని తెలిపింది. యాప్‌లో అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను సంప్రదించడం, సైరన్ మోగించడం వంటి ఫీచర్లు ఉన్నాయి.

అయితే, ప్రారంభ దశలో కొన్ని పరిమితులు కూడా కనిపిస్తున్నాయి. ఛార్జీలు ఎప్పుడూ పోటీ యాప్‌ల కంటే తక్కువగా ఉండటం లేదు. కొన్నిసార్లు ఏసీ, నాన్-ఏసీ క్యాబ్‌లకు ఒకే ధర చూపించడం వంటివి యాప్‌ను ఇంకా మెరుగుపరచాల్సి ఉందని సూచిస్తున్నాయి. డ్రైవర్లను ప్రోత్సహించేందుకు, వారి నుంచి ఎలాంటి కమీషన్ వసూలు చేయబోమని, ప్రయాణికులు చెల్లించిన పూర్తి ఛార్జీని వారే ఉంచుకోవచ్చని 'భారత్ ట్యాక్సీ' ప్రకటించింది. భవిష్యత్తులో విమానాశ్రయాలు, ఇతర రవాణా కేంద్రాల్లో ప్రత్యేక పికప్, డ్రాప్ జోన్‌లను ఏర్పాటు చేసేందుకు కూడా ప్రణాళికలు రచిస్తోంది.
Go Back to Shorts
Bharat Taxi
Ride-hailing app
Ola
Uber
Amit Shah
Atmanirbhar Bharat
Cab service
Cooperative Ministry
Taxi app India
Digital India

More Telugu News