మండలిలో కంటతడి పెట్టిన ఎమ్మెల్సీ కవిత.. వీడియో ఇదిగో!
- అవమానించి పార్టీలో నుంచి గెంటేశారంటూ భావోద్వేగం
- బీఆర్ఎస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని ఆరోపణ
- అవినీతిని ప్రశ్నించినందుకు తనను వేధించారని మండిపడ్డ కవిత
శాసనమండలిలో కవిత మాట్లాడుతూ... 2014లో జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించామని చెప్పారు. ఆ తర్వాత నుంచి తనపై ఆంక్షలు మొదలయ్యాయని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎలా ఉంటుందని ప్రశ్నించారు. పార్టీలో అవినీతిని ప్రశ్నిస్తే తనపై కక్షగట్టారని ఆరోపించారు. ఈడీ, సీబీఐలతో పోరాడేటప్పుడు పార్టీ తనకు అండగా నిలవలేదని, కేసీఆర్పై కక్షతో బీజేపీ తనను జైలులో పెట్టించినా పార్టీ ఆదుకోలేదని కవిత విమర్శించారు.
అన్నింటా అవినీతే..
‘‘అమరువీరుల స్తూపం మొదలు కలెక్టరేట్ల వరకు.. అన్నింటా అవినీతి జరిగింది. సిద్దిపేటలో నిర్మించిన కలెక్టరేట్ ఒక్క వర్షానికే కొట్టుకుపోయింది. అమరవీరులకు తగిన గుర్తింపు ఇవ్వాలని, ఉద్యమకారులకు పింఛను ఇవ్వాలని పార్టీ వేదికల్లో డిమాండ్ చేసినా పట్టించుకోలేదు. కేసీఆర్ను అడిగే ధైర్యం నాకే ఉందని ఎన్నో విషయాలు అడిగాను. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని ఎన్నిమార్లు కోరినా ఉపయోగం లేకుండా పోయింది. ఆ పరిశ్రమ తెరిపించలేకపోవడం నాకు అవమానకరం. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ పై వచ్చిన ఆరోపణలను బీఆర్ఎస్ లో పెద్ద నాయకులమని చెప్పుకునే వాళ్లు ఎవరూ స్పందించలేదు. అందుకే ప్రెస్మీట్ పెట్టి బలంగా మాట్లాడాను. అవినీతిపరుల పేర్లు మీడియాకు వెల్లడించాను’’ అని కవిత అన్నారు.