Chandrababu: విశాఖ రిఫైనరీలో కీలక ముందడుగు.. ఆత్మనిర్భర్ భారత్‌లో మరో మైలురాయి: సీఎం చంద్రబాబు

Andhra Pradesh achieves another major milestone says CM Chandrababu
  • విశాఖ రిఫైనరీలో రెసిడ్యూ అప్‌గ్రేడేషన్ ఫెసిలిటీ ప్రారంభం
  • ఆత్మనిర్భర్ భారత్‌లో ఇది మరో కీలక మైలురాయి అన్న సీఎం చంద్రబాబు
  • ప్రపంచంలోనే అత్యంత భారీ రియాక్టర్లను దేశీయంగానే తయారు చేశారని కితాబు
  • కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ట్వీట్‌కు స్పందించిన ముఖ్యమంత్రి
  • ఈ ప్రాజెక్టుతో తూర్పు తీరం వరల్డ్ క్లాస్ రిఫైనింగ్ హబ్‌గా మారుతుందని వెల్లడి
విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) రిఫైనరీలో కొత్తగా ఏర్పాటు చేసిన రెసిడ్యూ అప్‌గ్రేడేషన్ ఫెసిలిటీ (RUF) విజయవంతంగా ప్రారంభమైంది. ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ సాధించిన మరో కీలక మైలురాయి అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ ప్రాజెక్టుపై చేసిన ట్వీట్‌కు చంద్రబాబు 'ఎక్స్‌' వేదికగా స్పందించారు. "విశాఖ రిఫైనరీ ఆధునికీకరణ ప్రాజెక్టులో భాగంగా ఈ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అత్యంత బరువైన మూడు రియాక్టర్లు ఇక్కడ ఉండటం విశేషం" అని ఆయన తన పోస్టులో తెలిపారు. ఈ అప్‌గ్రేడ్ వల్ల ప్రాంతీయ ఇంధన అవసరాలు తీరడంతో పాటు సామాజిక-ఆర్థిక వృద్ధికి కూడా ఊతం లభిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

అంతకుముందు ఈ ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందిస్తూ.. ఇది దేశీయ ఇంజినీరింగ్ నైపుణ్యానికి నిదర్శనమని కొనియాడారు. దాదాపు 2,200 మెట్రిక్ టన్నుల బరువున్న మూడు భారీ రియాక్టర్లను పూర్తిగా దేశీయంగానే తయారు చేసి, అసెంబుల్ చేశారని ఆయన వెల్లడించారు. 3.55 MMTPA సామర్థ్యం గల ఈ యూనిట్, అత్యాధునిక టెక్నాలజీతో తక్కువ విలువైన ముడి చమురు అవశేషాలను 93 శాతం వరకు అధిక విలువైన ఉత్పత్తులుగా మారుస్తుందని తెలిపారు.

తూర్పు తీరంలో అత్యంత పురాతనమైన విశాఖ రిఫైనరీని 1956లో కాల్టెక్స్ ఆయిల్ రిఫైనింగ్ ఇండియా 0.675 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ప్రారంభించింది. 1978 నుంచి ఇది హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ యాజమాన్యంలో నడుస్తోంది.
Chandrababu
Visakhapatnam
HPCL Refinery
Residue Upgradation Facility
Atmanirbhar Bharat
Hardeep Singh Puri
Petroleum
Energy Security
Andhra Pradesh
Visakh Refinery

More Telugu News