ఇండియాలో ఆడమన్న బంగ్లాదేశ్.. టీ20 షెడ్యూల్ మార్పుపై ఐసీసీ కసరత్తు

Bangladesh Asks ICC to Move World Cup Matches from India
షార్ట్స్‌లో చూడండి
2026 టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి సరిగ్గా నెల రోజుల ముందు అంతర్జాతీయ క్రికెట్‌లో ఊహించని సంక్షోభం తలెత్తింది. ఈ మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యమిస్తున్న వేళ, తమ మ్యాచ్‌లను ఇక్కడ ఆడేది లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తేల్చిచెప్పింది. తమ ఆటగాళ్ల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని, తమ మ్యాచ్‌లన్నింటినీ శ్రీలంకకు తరలించాలని ఐసీసీకి అధికారికంగా విజ్ఞప్తి చేసింది. ఈ అనూహ్య పరిణామంతో టోర్నమెంట్ నిర్వహణ గందరగోళంలో పడింది.

వివాదానికి కారణమిదే
భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇటీవల దౌత్య సంబంధాలు క్షీణించడమే ఈ వివాదానికి మూలం. దీని ప్రభావంతో బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ ఐపీఎల్ కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) యాజమాన్యాన్ని బీసీసీఐ ఆదేశించింది. ఈ నిర్ణయం బంగ్లాదేశ్‌లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. దీనిపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. తమ దేశ క్రికెటర్‌ను అవమానించిన చోట, తమ జాతీయ జట్టు ప్రపంచకప్ ఎలా ఆడుతుందని ప్రశ్నించింది.

ప్రభుత్వ ఆదేశాలతోనే బీసీబీ నిర్ణయం
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంలోని యువజన, క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. "బంగ్లాదేశ్ క్రికెట్‌ను, క్రికెటర్లను, దేశాన్ని అవమానిస్తే సహించబోము. బానిసత్వపు రోజులు ముగిశాయి" అని ఆయన తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఒప్పందం ప్రకారం ఆడుతున్న తమ ఆటగాడికి భార‌త్‌లో భద్రత లేనప్పుడు, తమ జాతీయ జట్టు అక్కడ ఎలా సురక్షితంగా ఉంటుందని భావించాలని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే బీసీబీ.. మ్యాచ్‌ల తరలింపు కోసం ఐసీసీని ఆశ్రయించింది.

ఐసీసీకి తీవ్ర సవాలు
టోర్నమెంట్ ఫిబ్రవరి 7న ప్రారంభం కానుండగా, చివరి నిమిషంలో వచ్చిన ఈ అభ్యర్థన ఐసీసీకి, ఛైర్మన్ జై షాకు పెను సవాలుగా మారింది. వాస్తవానికి బంగ్లాదేశ్‌కు సౌకర్యంగా ఉండేలా సరిహద్దుకు సమీపంలోని కోల్‌కతాలో మూడు గ్రూప్ మ్యాచ్‌లను షెడ్యూల్ చేశారు. ఇప్పుడు హఠాత్తుగా శ్రీలంకలో వేదికలు, హోటళ్లు, ఇతర ఏర్పాట్లు చేయడం నిర్వాహకులకు కత్తిమీద సాములా మారింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం ఐసీసీ ఇప్పటికే కొత్త షెడ్యూల్‌ను రూపొందించే పనిలో నిమగ్నమైంది.

పాత షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న వెస్టిండీస్‌తో, 9న ఇటలీతో, 14న ఇంగ్లండ్‌తో కోల్‌కతాలో ఆడాల్సి ఉంది. చివరి గ్రూప్ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో నేపాల్‌తో జరగాల్సి ఉంది. ఈ గందరగోళం నడుమ లిట్టన్ కుమార్ దాస్ కెప్టెన్సీలో 15 మంది సభ్యులతో కూడిన ప్రపంచకప్ జట్టును బీసీబీ ప్రకటించడం గమనార్హం.
Go Back to Shorts
T20 World Cup 2026
Bangladesh Cricket Board
BCB
ICC
India
Sri Lanka
Mustafizur Rahman
Kolkata Knight Riders
Jay Shah
Litton Das

More Telugu News