సహకరించకపోతే టారిఫ్ల మోత.. భారత్కు ట్రంప్ మరోసారి వార్నింగ్
- రష్యా చమురు విషయంలో భారత్కు ట్రంప్ హెచ్చరిక
- భారత్తో వాణిజ్య చర్చలతో ఈ అంశాన్ని ముడిపెట్టిన ట్రంప్
- మోదీ హామీ ఇచ్చారన్న వాదనను గతంలోనే ఖండించిన భారత్
"రష్యా చమురు విషయంలో భారత్ మాకు సహాయం చేయకపోతే, మేము వారిపై టారిఫ్లు పెంచగలం" అని ట్రంప్ అన్నట్లు రాయిటర్స్ తెలిపింది. ఇరు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలతో ఈ అంశాన్ని ఆయన ముడిపెట్టారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలతో భారత్-రష్యా ఇంధన సంబంధాల చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు మళ్లీ తెరపైకి వచ్చాయి.
గతంలో కూడా రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ ప్రకటించారు. అయితే, ట్రంప్ వాదనలను భారత ప్రభుత్వం అప్పట్లోనే తోసిపుచ్చింది. ప్రధాని మోదీ, ట్రంప్ మధ్య అలాంటి చర్చ ఏదీ జరగలేదని స్పష్టం చేసింది. ఇప్పుడు మరోసారి ట్రంప్ ఇదే అంశాన్ని ప్రస్తావించడం గమనార్హం.