వెనెజువెలాపై అమెరికా సైనిక చర్య... ఢిల్లీలో వామపక్షాల నిరసనలు

వెనెజువెలాపై అమెరికా సైనిక చర్యకు దిగడం, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్యను బంధించడాన్ని నిరసిస్తూ పలు వామపక్ష పార్టీలు ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టాయి. వెనెజువెలాపై అమెరికా చర్యను 'సామ్రాజ్యవాద సైనిక దురాక్రమణ'గా అభివర్ణించిన సీపీఎం, దీన్ని ప్రపంచ దేశాలు ఖండించాలని పిలుపునిచ్చింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన, దృఢమైన వైఖరి తీసుకోవాలని డిమాండ్ చేసింది.

ఈ దాడిని సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్), ఆర్ఎస్‌పీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. అమెరికా చర్య ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను ఉల్లంఘించడమేనని ఆ పార్టీల ప్రధాన కార్యదర్శులు ఎం.ఏ. బేబీ, డి. రాజా, దీపాంకర్ భట్టాచార్య, జి. దేవరాజన్, మనోజ్ భట్టాచార్య సంయుక్త ప్రకటనలో తెలిపారు. "వెనెజువెలా చమురు నిల్వలను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ చెప్పడంతోనే వారి అసలు ఉద్దేశం బయటపడింది. క్యూబా, మెక్సికో తమ తదుపరి లక్ష్యాలని అమెరికా విదేశాంగ మంత్రి హెచ్చరించారు" అని వారు పేర్కొన్నారు.

ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని, అమెరికా చర్యను ఖండించాలని, వెనెజువెలాకు సంఘీభావం ప్రకటించాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి.

వెనెజువెలా రాజధాని కారకాస్‌పై తమ బలగాలు భారీ దాడి చేశాయని, అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను బంధించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ నిరసనలు జరిగాయి. మరోవైపు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నార్కో-టెర్రరిజం ఆరోపణలపై విచారణ ఎదుర్కొనేందుకు మదురోను న్యూయార్క్‌కు తరలించారు. రెండు దశాబ్దాలుగా అమెరికాకు భారీగా కొకైన్ తరలించేందుకు మదురో తన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని యూఎస్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.


Nicolas Maduro
Venezuela
US military action
Left parties protest
Delhi Jantar Mantar
Donald Trump
Venezuela crisis
Communists
Imperialism
International relations

More Telugu News