అర్థం చేసుకుంటారని భావిస్తున్నా: పవన్ కల్యాణ్ తెలంగాణ పర్యటనపై జడ్చర్ల ఎమ్మెల్యే

  • తెలంగాణ ప్రజల మనసు గొప్పదనే విషయం ఆయనకు అర్థం కావాలన్న అనిరుధ్ రెడ్డి
  • ఆయన ఇప్పటికైనా దిగజారుడు వ్యాఖ్యలు మానుకోవాలని సూచన
  • నరదిష్టి అంటూ మాపై వ్యాఖ్యలు చేసినప్పటికీ ఆయనకు ఘన స్వాగతం పలికామన్న ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ తెలంగాణ పర్యటనపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పందించారు. తెలంగాణ ప్రజల మనసు గొప్పదనే విషయం ఆయన ఇప్పటికైనా అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని అన్నారు. ఆయన ఇప్పటికైనా దిగజారుడు వ్యాఖ్యలు మానుకుని తెలంగాణ స్థాయిని తెలుసుకోవాలని సూచించారు. మాది నర దిష్టి అని వ్యాఖ్యలు చేసినప్పటికీ ఈరోజు ఆయనకు ఘనస్వాగతం పలికి, అత్యంత గౌరవం ఇచ్చామని తెలిపారు.

ప్రోటోకాల్ విషయంలోనూ ఆయనకు గౌరవం ఇచ్చామని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పవన్ కల్యాణ్ పేరు పైన పెట్టి, తెలంగాణ మంత్రుల పేర్లు కింద పెట్టినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేరును పెట్టాల్సిన అవసరం లేకపోయినప్పటికీ, ఆయన పేరును కూడా పేర్కొన్నట్లు తెలిపారు. 

తెలంగాణ ప్రజల మంచి మనసును పవన్ కల్యాణ్ ఇప్పటికైనా గుర్తించాలని అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాము ఎప్పుడూ ఒకరి బాగు కోరే వారిమే తప్ప ఒకరికి దిష్టి పెట్టే వాళ్లం మాత్రం కాదని అన్నారు. తెలంగాణ నాయకులు దిష్టి పెట్టడం వల్లే కోనసీమ కొబ్బరిచెట్లు ఎండిపోయాయని కొద్ది రోజుల క్రితం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే.


More Telugu News