Atul Singh: అవినీతి తిమింగలాలపై ఏఐ అస్త్రం.. ఇక పని పడతామన్న ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీ

ACB to deploy AI to track benami properties says Atul Singh
  • అవినీతిపరుల బినామీ ఆస్తులపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో నిఘా
  • అవినీతి తిమింగలాల పని పడతామన్న ఏసీబీ డీజీ అతుల్ సింగ్
  • మూడేళ్లలో దోషులకు శిక్ష పడేలా కొత్త లక్ష్యం నిర్దేశించుకున్న ఏసీబీ
  • 2025లో రెవెన్యూ శాఖలోనే అత్యధిక అవినీతి కేసుల నమోదు
  • అవినీతిపై సమాచారం ఇవ్వాలని ప్రజలకు ఏసీబీ విజ్ఞప్తి
రాష్ట్రంలో అవినీతి తిమింగలాల పని పడతామని, వారిపై ఇప్పటికే నిఘా పెట్టామని ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డైరెక్టర్ జనరల్ (డీజీ) అతుల్ సింగ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అవినీతికి పాల్పడిన వారికి మూడేళ్లలోనే శిక్ష పడేలా చేసి జైలుకు పంపడమే లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. అవినీతిపరుల బినామీ ఆస్తుల డేటాను సేకరించేందుకు తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని వినియోగిస్తున్నామని ఆయన తెలిపారు.

శుక్రవారం విజయవాడలోని ఎన్టీఆర్ పరిపాలన భవనంలో అతుల్ సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు. 2025 వార్షిక నివేదికను విడుదల చేసిన సందర్భంగా ఏసీబీ కొత్త వ్యూహాలను, లక్ష్యాలను వివరించారు. ఈ సమావేశంలో ఏసీబీ డైరెక్టర్ ఆర్. జయలక్ష్మి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అతుల్ సింగ్ మాట్లాడుతూ, "రాష్ట్రంలో కరుడుగట్టిన అవినీతిపరులపై నిఘా పెట్టాం. వారి బినామీల డేటాను ఏఐ ద్వారా సేకరిస్తున్నాం. ఈ ఏడాది అవినీతి తిమింగలాల పని పడతాం. అవినీతికి పాల్పడినవారిని మూడేళ్లలోనే జైలుకు పంపాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం," అని అన్నారు. ఐజీఆర్ఎస్ వ్యవస్థ నుంచి బినామీ ఆస్తుల రిజిస్ట్రేషన్ వివరాలు, అనుమానిత బ్యాంకు లావాదేవీలను ఏఐ ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు.

2025లో రాష్ట్రవ్యాప్తంగా 115 కేసులు నమోదు కాగా, వాటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖలోనే 19 ట్రాప్ కేసులు ఉన్నాయని డీజీ వెల్లడించారు. గతేడాది ఏసీబీ కేసుల్లో శిక్షల రేటు 46 శాతంగా ఉందని, ఇది సంతృప్తికరంగా లేదని ఆయన అంగీకరించారు. శిక్షల రేటును పెంచేందుకు, కోర్టులో సాక్షులు మాట మార్చకుండా ఉండేందుకు ఇకపై వారి వాంగ్మూలాలను మేజిస్ట్రేట్ ముందు (సీఆర్‌పీసీ సెక్షన్ 164 కింద) నమోదు చేయిస్తామని చెప్పారు.

అవినీతి నిర్మూలనకు ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని డీజీ విజ్ఞప్తి చేశారు. "ప్రభుత్వ శాఖల్లో అవినీతి కట్టడికి ఏసీబీ ప్రయత్నాలు సరిపోవు. ప్రజలూ సహకరిస్తేనే అవినీతి రాకాసిని అణచివేయగలం. పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయండి, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం" అని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064, వాట్సాప్ నెంబర్ 9440440057లను విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది రెవెన్యూతో పాటు మరో నాలుగు కీలక శాఖలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు ప్రకటించారు.
Atul Singh
Andhra Pradesh ACB
Anti Corruption Bureau
Corruption
Artificial Intelligence
AI Technology
Benamee Assets
Chandrababu Naidu
Vijayawada
Revenue Department

More Telugu News