న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్: నేడు భారత జట్టు ప్రకటన.. పంత్ భవితవ్యంపై ఉత్కంఠ

  • కివీస్‌తో 11 నుంచి మూడు వన్డేల సిరీస్  
  • మెడ నొప్పి నుంచి కోలుకున్న శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా పునరాగమనం
  • వన్డే ఫార్మాట్‌లో రిషభ్ పంత్ స్థానంపై సందిగ్ధత
  • రేసులో ఇషాన్ కిషన్, ధ్రువ్ జురెల్
  • సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ రీ-ఎంట్రీ ఇచ్చే అవకాశం
  • బుమ్రా, హార్దిక్‌లకు విశ్రాంతి
2026 సంవత్సరంలో భారత్ ఆడబోయే మొదటి ద్వైపాక్షిక సిరీస్ (న్యూజిలాండ్‌తో వన్డేలు) కోసం సర్వం సిద్ధమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నేడు భారత జట్టును అధికారికంగా ప్రకటించనుంది. ఈ సిరీస్ ద్వారా రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తిరిగి జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. మెడ నొప్పి కారణంగా గిల్ దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే.

ఈ ఎంపికలో అందరి దృష్టి వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌పైనే ఉంది. టెస్టుల్లో తిరుగులేని ఆటగాడిగా ఉన్న పంత్.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో (ముఖ్యంగా వన్డేల్లో) ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఇటీవలి విజయ్ హజారే ట్రోఫీలో కూడా అతడి ఫామ్ అంతంతమాత్రంగానే ఉండటంతో, సెలెక్టర్లు ఆయనను పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, దేశవాళీ క్రికెట్‌లో సెంచరీలతో చెలరేగుతున్న ఇషాన్ కిషన్ లేదా నిలకడగా ఆడుతున్న ధ్రువ్ జురెల్‌లకు బ్యాకప్ కీపర్‌గా అవకాశం దక్కవచ్చు. కె.ఎల్. రాహుల్ మొదటి ఛాయిస్ కీపర్‌గా కొనసాగడం దాదాపు ఖాయం.

బౌలింగ్ విభాగంలో.. ఫిబ్రవరిలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ తిరిగి వన్డే జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టిన దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్‌ల పేర్లను కూడా సెలెక్టర్లు పరిశీలిస్తున్నారు. వడోదర (జనవరి 11), రాజ్‌కోట్ (జనవరి 14), ఇండోర్ (జనవరి 18) వేదికలుగా ఈ మూడు వన్డేలు జరగనున్నాయి.


More Telugu News