Telangana Congress Leader: మావోల హిట్‌లిస్ట్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ నేత.. వదిలిపెట్టబోమని హెచ్చరిక

మావోయిస్టు పార్టీ అగ్రనేత మాద్వి హిడ్మా మృతి వెనుక ఉన్న కుట్రదారులను తాము గుర్తించినట్టు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం - అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ శుక్రవారం 'విప్లవ' పేరుతో ఒక బహిరంగ లేఖను విడుదల చేసింది. అనారోగ్యంతో ఉన్న హిడ్మా, రాజితో పాటు మరికొంత మంది సభ్యులకు వైద్యం చేయిస్తానని నమ్మించి, ఒక కాంట్రాక్టర్ తమను మోసం చేశాడని మావోయిస్టులు ఆరోపించారు.

ఈ కుట్రలో భద్రాద్రి జిల్లా చర్ల ప్రాంతానికి చెందిన ఒక ముఖ్య కాంగ్రెస్ నాయకుడి పాత్ర కీలకమని పార్టీ లేఖలో పేర్కొంది. గతంలో తాము క్షమాభిక్ష పెట్టిన సదరు నాయకుడే కొండవాయి మార్గంలో కారును ఏర్పాటు చేసి మావోయిస్టులను ఆంధ్ర ప్రాంతానికి తరలించారని, అక్కడ వారిని శత్రువులకు చిక్కేలా చేశారని వివరించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వాయిస్ రికార్డులు, పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పార్టీ స్పష్టం చేసింది.

పార్టీని మోసం చేసిన వారిని వదిలిపెట్టబోమని ఈ సందర్భంగా మావోయిస్టులు హెచ్చరించారు. ఇటీవల పార్టీకి ద్రోహం చేసిన ఒక కాంట్రాక్టర్‌ను ఇప్పటికే అంతమొందించామని గుర్తు చేస్తూ, తమ నిఘాలో మరికొంత మంది కాంట్రాక్టర్లు ఉన్నారని లేఖలో హెచ్చరించారు. వైద్యం కోసం వెళ్లిన అగ్రనేతలను శత్రువులకు పట్టించడం వెనుక భారీ కుట్ర జరిగిందని మావోయిస్టు పార్టీ ఈ లేఖ ద్వారా నొక్కి చెప్పింది.
Telangana Congress Leader
Maoists
Madvi Hidma
Bhadrari Kothagudem
Alluri Sitarama Raju
Naxalites
Telangana
Andhra Pradesh
Contractors

More Telugu News