HYDRAA: గండిగూడలో రూ.1200 కోట్ల భూమికి కంచె.. కబ్జాలపై హైడ్రా ఉక్కుపాదం

HYDRAA Secures Rs 1200 Crore Government Land in Gandi Guda
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ శివార్లలోని అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడేందుకు అధికారులు రంగంలోకి దిగారు. రంగారెడ్డి జిల్లా, గండిపేట మండలం, గండిగూడ గ్రామంలోని 12.17 ఎకరాల ప్రభుత్వ భూమిని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA - హైడ్రా) తన అధీనంలోకి తీసుకుంది. మార్కెట్ విలువ ప్రకారం ఈ భూమి ధర సుమారు రూ.1200 కోట్లు ఉంటుందని అంచనా.

స్థానికుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు శుక్రవారం హైడ్రా అధికారులు సంబంధిత శాఖలతో కలిసి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. అక్రమ కబ్జాలు జరుగుతున్నట్లు నిర్ధారించుకున్న తర్వాత, వెంటనే ఆ భూమి చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వ భూమి అని, హైడ్రా పరిరక్షణలో ఉందని స్పష్టం చేస్తూ హెచ్చరిక బోర్డులను కూడా అక్కడ ఏర్పాటు చేశారు.  మిగిలిన ఖాళీ స్థలాన్ని ప్రజా ప్రయోజనాల కోసం కాపాడటమే ఈ చర్యల ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.

గండిగూడలోని సర్వే నంబర్ 43లో మొత్తం 26 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఒక ఎకరాన్ని విద్యుత్ సబ్‌స్టేషన్‌కు, మరో తొమ్మిది ఎకరాలను చెత్త నిర్వహణ, ప్రాసెసింగ్ కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)కి గతంలో కేటాయించారు. మిగిలిన 12 ఎకరాలకు పైగా భూమి క్రమంగా కబ్జాకు గురవుతుండటంతో స్థానికులు హైడ్రా పబ్లిక్ గ్రీవెన్స్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు.

భూమి ప్రభుత్వానిదేనని ధ్రువీకరించుకున్న తర్వాత హైడ్రా కమిషనర్ ఏ.వీ. రంగనాథ్ ఆదేశాలతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. భూమిని స్వాధీనం చేసుకునే సమయంలో, ఆ స్థలంలో అప్పటికే ఒక ఆలయం, ఒక మసీదు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ నిర్మాణాలను ఏమాత్రం తాకబోమని, వాటి చుట్టూ ఫెన్సింగ్ వేసి మిగతా ఖాళీ స్థలాన్ని మాత్రమే పరిరక్షిస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. హైదరాబాద్ రీజియన్‌లోని ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్లు హైడ్రా వర్గాలు తెలిపాయి.
Go Back to Shorts
HYDRAA
Hyderabad HYDRAA
Gandi Guda
Rangareddy district
Land grabbing
Government land
Telangana land
GHMC
AV Ranganath

More Telugu News