Nagarjuna: షిరిడీ సాయిని దర్శించుకున్న నాగార్జున... 100వ సినిమాపై ప్రకటన

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నూతన సంవత్సరాది ముంగిట షిరిడీ సాయిబాబాను దర్శించుకున్నారు. బాబా తన కలలోకి వచ్చి పిలిచారని, అందుకే చాలా ఏళ్ల తర్వాత హుటాహుటిన వచ్చినట్లు నాగార్జున తెలిపారు. ఈ సందర్భంగా తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోనున్న 100వ సినిమాపై కీలక ప్రకటన చేశారు.

సంవత్సరాంతం సందర్భంగా బుధవారం ఉదయం నాగార్జున షిరిడీకి చేరుకున్నారు. బాబా సమాధి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం ఆలయ సంస్థాన్ సీఈవో గోరక్ష్ గడిల్కర్, నాగార్జునను శాలువాతో సత్కరించి, బాబా విగ్రహాన్ని బహూకరించారు. నాగార్జున రాకతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది.

దర్శనం అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడారు. "చాలా సంవత్సరాల తర్వాత షిరిడీకి వచ్చాను. గత మూడు నాలుగు రోజులుగా బాబా నా కలలోకి వచ్చి రమ్మని పిలుస్తున్నారు. ఆయన పిలుపుతోనే వెంటనే బయలుదేరి వచ్చాను. దర్శనం చాలా బాగా జరిగింది. మనసు ప్రశాంతంగా, హాయిగా ఉంది" అని తన అనుభూతిని పంచుకున్నారు.

ఈ సందర్భంగా తన 100వ సినిమా గురించి మాట్లాడుతూ... "2026లో నా వందో సినిమా ప్రారంభం కానుంది. ఇది నా కెరీర్‌లో ఒక పెద్ద మైలురాయి. బాబా ఆశీస్సులతోనే ఈ ఘనత అందుకోబోతున్నాను" అని సంతోషం వ్యక్తం చేశారు. గతంలో నాగార్జున 'షిరిడీ సాయి' చిత్రంలో సాయిబాబా పాత్రలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు బాబా ఆశీస్సులతో తన వందో సినిమా ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
Nagarjuna
Akkineni Nagarjuna
Shirdi Sai Baba
Nagarjuna 100th movie
Tollywood
Shirdi
Sai Baba
Nagarjuna Shirdi visit
Telugu cinema
2026

More Telugu News