ప్రపంచంలోనే అందరికంటే ముందుగా 2026కు స్వాగతం పలికిన కిరిబాటి

  • కిరిబాటిలో గ్రాండ్‌గా 2026కు వెల్కమ్
  • పసిఫిక్ దేశమైన కిరిబాటిలో మొదలైన న్యూ ఇయర్ వేడుకలు
  • కిరితిమతి దీవికే క్రిస్మస్ ఐలాండ్ అని పేరు
  • కిరితిమతిలో అడుగుపెట్టిన 2026
ప్రపంచమంతా 2026 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబాటి దేశంలోని కిరితిమతి (క్రిస్మస్ ఐలాండ్) దీవిలో అప్పుడే కొత్త సంవత్సరం అడుగుపెట్టింది. ప్రపంచంలోనే అందరికంటే ముందుగా 2026కు స్వాగతం పలికిన ప్రాంతంగా కిరితిమతి నిలిచింది. అంతర్జాతీయ సమయ రేఖ (International Date Line) ఆధారంగా ఇక్కడ కొత్త సంవత్సరం ముందుగా ప్రవేశిస్తుంది. భార‌త కాల‌మానం ప్ర‌కారం ఇక్క‌డ మ‌ధ్యాహ‌నం 3.30 గంట‌ల‌కే కొత్త ఏడాది ప్ర‌వేశించింది. దీంతో స్థానికులు బాణాసంచా పేలుస్తూ, ఉత్సాహంగా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు.

కిరిబాటి దేశంలో అంతర్భాగమైన కిరితిమతి దీవి.. హవాయికి దక్షిణాన, ఆస్ట్రేలియాకు ఈశాన్యంలో ఉంది. కిరిబాటిలోని ఇతర ప్రాంతాలు కూడా మరికొద్ది గంటల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నాయి. తూర్పు నుంచి పడమర వరకు దాదాపు 4,000 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ దేశంలో అనేక పగడపు దీవులు (Atolls) ఉన్నాయి. భౌగోళికంగా హవాయికి దగ్గరగా ఉన్నప్పటికీ.. టైమ్ జోన్ల కారణంగా కిరిబాటిలో ఒక రోజు ముందుగానే న్యూ ఇయర్ వేడుకలు జరగడం విశేషం.

బ్రిటన్ నుంచి 1979లో స్వాతంత్ర్యం పొందిన కిరిబాటి జనాభా సుమారు 1,16,000. దీనిని స్థానికంగా 'కిరిబాస్' అని పిలుస్తారు. దక్షిణ పసిఫిక్‌లో అతిపెద్ద మెరైన్ రిజర్వ్ ఇక్కడే ఉంది. అయితే, గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్ర మట్టాలు పెరుగుతుండటంతో.. లోతట్టు ప్రాంతాలైన ఈ దీవులు భవిష్యత్తులో ముంపు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. కిరితిమతి తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాలు వరుసగా 2026కు స్వాగతం పలకనున్నాయి.


More Telugu News