Chandrababu Naidu: పోలవరం లేని జిల్లాకు ఆ పేరేంటి?.. మంత్రి దుర్గేశ్ సందేహానికి సీఎం చంద్రబాబు సమాధానం

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో జిల్లాల పేర్ల పునర్వ్యవస్థీకరణపై ఆసక్తికర చర్చ జరిగింది. "పోలవరం ప్రాజెక్టు లేకుండా పోలవరం జిల్లా అని పేరు ఎందుకు?" అని మంత్రి కందుల దుర్గేశ్ అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి చంద్రబాబు తనదైన శైలిలో బదులిచ్చారు.

సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ సంభాషణ చోటుచేసుకుంది. మంత్రి దుర్గేశ్ సందేహంపై స్పందించిన చంద్రబాబు.. "పోలవరం నిర్వాసితులు ఆ ప్రాంతంలో ఉన్నందునే జిల్లాకు ఆ పేరు పెట్టాల్సి వచ్చింది" అని స్పష్టత ఇచ్చారు. ఇందుకు ఉదాహరణగా ఎన్టీఆర్ జిల్లాను ప్రస్తావించారు. "ఎన్టీఆర్ సొంత ఊరు లేకుండానే ఎన్టీఆర్ జిల్లా ఉంది కదా?" అని గుర్తుచేశారు. మహానుభావుల పేర్లను పరిగణనలోకి తీసుకుని ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన సూచించారు.

ఈ సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. పశ్చిమ గోదావరి మినహా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఓడరేవు ఉండేలా చర్యలు చేపట్టాలని, పశ్చిమ గోదావరిలో పోర్టు ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రజలకు ఊరటనిస్తూ యూనిట్‌కు 13 పైసల చొప్పున విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.

వీటితో పాటు కుప్పం, దగడర్తిలో ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో ఏఐఆర్ఏఎస్-క్వాంటమ్ కాన్ఫరెన్స్ నిర్వహణకు కూడా పచ్చజెండా ఊపింది. రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పలు అంశాలపై మంత్రివర్గం చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది.
Chandrababu Naidu
Andhra Pradesh
Polavaram Project
AP Cabinet Meeting
Kandula Durgesh
NTR District
Electricity Charges
Kuppam Airport
Dagadarthi Airport
Amaravati

More Telugu News