Mohsin Naqvi: వాళ్లు వద్దంటే మేమూ వద్దంటాం.. భారత్‌తో షేక్ హ్యాండ్ అక్కర్లేదు: మోసిన్ నఖ్వీ

భారత క్రికెట్ జట్టు అనుసరిస్తున్న 'నో-షేక్‌హ్యాండ్' (కరచాలనం చేయకపోవడం) విధానంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ మోసిన్ నఖ్వీ ఘాటుగా స్పందించారు. టీమిండియా తమ వైఖరిని కొనసాగిస్తే, తాము కూడా అదే విధంగా బదులిస్తామని, వారితో కరచాలనం చేయాలనే ప్రత్యేక ఆసక్తి తమకు లేదని ఆయన స్పష్టం చేశారు.

లాహోర్‌లో విలేకరులతో మాట్లాడుతూ నఖ్వీ ఈ వ్యాఖ్యలు చేశారు. "వారు మాతో షేక్ హ్యాండ్ చేయడానికి ఇష్టపడకపోతే మాకేమీ ఇబ్బంది లేదు. ఇకపై భారత్‌తో ఏది జరిగినా అది సమాన స్థాయిలో ఉంటుంది. వాళ్లు ఒకలా ప్రవర్తిస్తే మేము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఈ వైఖరి ముందు కూడా కొనసాగుతుంది" అని ఆయన తెలిపారు. పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నఖ్వీ, క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టవద్దన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు.

పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది భారత పర్యాటకులు మరణించిన ఘటనకు నిరసనగా, బాధితులకు సంఘీభావం తెలుపుతూ బీసీసీఐ ఈ కఠిన వైఖరిని అవలంబిస్తోంది. గత సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా కప్ నుంచి భారత పురుషుల, మహిళల జట్లు పాకిస్థాన్ ఆటగాళ్లతో మ్యాచ్ అనంతరం కరచాలనం చేయడం లేదు. ఈ నెలలో జరిగిన అండర్-19 ఆసియా కప్‌లో కూడా ఇదే విధానాన్ని కొనసాగించారు.

పహల్గామ్ దాడి తర్వాత భారత్ 'ఆపరేషన్ సిందూర్' పేరుతో సరిహద్దుల్లో ఉగ్రవాద శిబిరాలపై సైనిక చర్య చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య క్రీడా సంబంధాల్లోనూ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
Mohsin Naqvi
PCB Chief
Pakistan Cricket Board
India Cricket
No Shakehand Policy
Asia Cup
Pahalgam Attack
Operation Sindoor
India Pakistan Relations
Cricket Diplomacy

More Telugu News