Vijayawada Durga Temple: రూ.3.08 కోట్ల బకాయిలు... విజయవాడ దుర్గ గుడికి ఆగిన విద్యుత్ సరఫరా!

Vijayawada Durga Temple Power Supply Halted Due to Unpaid Bills
  • వెంటనే స్పందించిన సంబంధిత శాఖల మంత్రులు 
  • విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటితో చర్చించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం 
  • మంత్రుల చొరవతో సరఫరా పునరుద్దరించిన విద్యుత్ శాఖ అధికారులు
  • భక్తులకు అసౌకర్యం కలగకుండా జనరేటర్లను వినియోగించిన ఆలయ అధికారులు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయానికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కొద్ది గంటల పాటు గందరగోళం నెలకొంది. దేవాదాయ శాఖ, విద్యుత్ శాఖల మధ్య బకాయిల వివాదమే దీనికి కారణమయింది. అయితే, మంత్రుల చొరవతో సమస్య సద్దుమణిగి, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరిగింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే, విద్యుత్ బిల్లుల బకాయిలు రూ. 3.08 కోట్లు చెల్లించనందున ఏపీసీపీడీసీఎల్ అధికారులు నిన్న ఉదయం 10:30 గంటల సమయంలో ఆలయానికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన దుర్గమ్మ ఆలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేయడం పట్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలియగానే మంత్రులు వెంటనే స్పందించారు.

దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెంటనే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సోమవారం దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై బకాయిల్లో కొంత మొత్తాన్ని చెల్లించేందుకు నిర్ణయం తీసుకోవాలని దుర్గగుడి అధికారులు నిర్ణయించారు. అంతేకాకుండా, ఆలయంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్తును గ్రిడ్‌కు అనుసంధానం చేసిన యూనిట్ల లెక్కలను కూడా తేల్చాలని దేవస్థానం అధికారులు కోరనున్నారు.

మంత్రుల జోక్యం, ఉన్నతాధికారుల ఆదేశాలు, కొంత బకాయిల చెల్లింపునకు హామీ ఇవ్వడంతో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆలయానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. విద్యుత్ సరఫరా నిలిచిన సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యామ్నాయంగా జనరేటర్లను ఉపయోగించారు. దర్శనాలు, సేవలు, లిఫ్టులు, అమ్మవారి అంతరాలయం సహా ఆలయంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. 
Vijayawada Durga Temple
Durga Temple
Vijayawada
Electricity Supply
APCPDCL
Anam Ramanarayana Reddy
Gottipati Ravikumar
Devadaya Department
Electricity Department

More Telugu News