Himachal Pradesh: శ్మశానంలో అస్థికల చోరీ!

హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో ఒక విచిత్రమైన దొంగతనం జరిగింది. చంబాఘాట్ శ్మశానవాటికలోని లాకర్‌లో భద్రపరిచిన ఓ మహిళ అస్థికలను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనతో మృతురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న తమకు ఈ చోరీ మరింత బాధను మిగిల్చిందని వారు వాపోయారు.

వివరాల్లోకి వెళితే.. సోలన్ నగరంలోని 5వ వార్డుకు చెందిన ఓ మహిళ 10 రోజుల క్రితం మృతి చెందారు. అంత్యక్రియల అనంతరం ఆమె అస్థికలను కుటుంబ సభ్యులు చంబాఘాట్ శ్మశానవాటికలోని అస్థికల లాకర్‌లో భద్రపరిచారు. వాటిని హరిద్వార్ తీసుకెళ్లి గంగానదిలో నిమజ్జనం చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, గురువారం ఉదయం అస్థికల కోసం శ్మశానానికి వెళ్లిన కుటుంబ సభ్యులకు షాక్ తగిలింది. లాకర్ పగలగొట్టి ఉండటం క‌నిపించింది. అందులోని అస్థికలు ఉన్న పాత్రతో పాటు ఒక ప్లేటు, లోటా కూడా కనిపించలేదు.

దీంతో మృతురాలి కుమారుడు కమల్ పాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. "మా అమ్మ అస్థికలను సంప్రదాయం ప్రకారం గంగానదిలో కలపాల్సి ఉంది. కానీ, అవి చోరీకి గురవడం మాకు తీరని వేదనను మిగిల్చింది. నిందితులను కఠినంగా శిక్షించాలి" అని ఆయన కోరారు.

ఈ ఘటనపై సోలన్ ఎస్పీ గౌరవ్ సింగ్ స్పందించారు. "అస్థికల దొంగతనంపై ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. శ్మశానవాటిక పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నాం. స్థానిక సిబ్బందిని కూడా విచారిస్తున్నాం" అని ఆయన తెలిపారు.
Himachal Pradesh
Solan Crime
Asthikal Theft
Cremation Ground
Chambaghat Crematorium
Ganga River
Police Investigation
Gaurav Singh SP Solan

More Telugu News