భీమవరం కొత్త డీఎస్పీగా రఘువీర్ విష్ణు... శాంతిభద్రతలపై రఘురామ దిశానిర్దేశం

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సబ్-డివిజన్ నూతన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా రఘువీర్ విష్ణు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును భీమవరంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉండి నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణపై రఘురామ దిశా నిర్దేశం చేశారు. శాంతిభద్రతల విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా, రాజీ పడకుండా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.

శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించిన వెంటనే డీఎస్పీ రఘువీర్ విష్ణు, డిప్యూటీ స్పీకర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ భద్రతపై వీరి మధ్య చర్చ జరిగింది. నేరాల నియంత్రణ, పర్యవేక్షణ కోసం ఉండి నియోజకవర్గం మొత్తం సీసీ కెమెరాల నిఘా నీడలోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు రఘురామ తెలిపారు. "నియోజకవర్గం మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. శాంతిభద్రతల విషయంలో రాజీ పడొద్దు" అని డీఎస్పీకి స్పష్టం చేశారు. దీంతో పాటు భీమవరం పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణపైనా చర్చించారు.

నూతన డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రఘువీర్ విష్ణు గతంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)లో పనిచేశారు. అంతేకాకుండా ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో భాగంగా కొసావోలో కూడా సేవలు అందించిన అనుభవం ఆయనకుంది. 


More Telugu News