30,000 మంది అతిథులు, 1,000 మంది వంటవాళ్లు.. మధ్యప్రదేశ్‌లో ఎమ్మెల్యే కుమారుడి విందు

  • భోపాల్‌లో సింపుల్‌గా సాంచి ఎమ్మెల్యే ప్రభు రామ్ చౌదరి పెద్ద కుమారుడి పర్వ్ చౌదరి వివాహం
  • రిసెప్షన్ మాత్రం ఘనంగా... రాయ్‌సెన్‌లో ఎనిమిది ఎకరాల్లో ఏర్పాటు
  • హాజరైన కేంద్రమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య సింధియా
మధ్యప్రదేశ్‌లోని రాయ్‌సెన్‌లో జరిగిన ఓ వివాహ వేడుక దాదాపు 30,000 మందికి ఆతిథ్యమిచ్చింది. ఈ వేడుకలో వెయ్యి మంది వంటవాళ్లు పాల్గొన్నారు. సాంచి ఎమ్మెల్యే డాక్టర్ ప్రభు రామ్ చౌదరి పెద్ద కుమారుడు పర్వ్ చౌదరి వివాహం ఇటీవల భోపాల్‌లో నిరాడంబరంగా జరిగింది. రిసెప్షన్‌‌ను మాత్రం రాయ్‌సెన్‌లో భారీ ఎత్తున నిర్వహించారు.

రాయ్‌సెన్‌లో సుమారు ఎనిమిది ఎకరాల్లో వేదికను ఏర్పాటు చేశారు. ప్రముఖుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జగదీశ్ దేవ్డా, మంత్రి గోవింద్ సింగ్ రాజ్‌పుత్, ఇతర సీనియర్ నేతలు ఈ వేడుకలో పాల్గొన్నారు.

ముప్పై వేల మంది అతిథుల కోసం వెయ్యి మంది వంటవాళ్లు దేశీ, విదేశీ వంటకాలను సిద్ధం చేశారు. రాయ్‌సెన్‌లో ఇంత పెద్ద వేడుక ఎప్పుడూ జరగలేదని స్థానికులు అంటున్నారు. ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కుమారుడి వివాహ వేడుక కొద్దిరోజుల క్రితం చాలా నిరాడంబరంగా జరిగింది. ముఖ్యమంత్రి చిన్న కుమారుడు డాక్టర్ అభిమన్యు తన చిరకాల స్నేహితురాలు డాక్టర్ ఇషితా పటేల్‌ను ఆదివారం ఉజ్జయినిలో వివాహం చేసుకున్నారు. బాబా రామ్‌దేవ్ మంత్రాలు చదువుతుండగా పూలదండలు మార్చుకుని నిరాడంబరంగా వివాహ తంతును ముగించారు.


More Telugu News