పరకామణి దొంగతనాన్ని సమర్థించిన జగన్ క్షమాపణ చెప్పాలి: బుచ్చి రాంప్రసాద్

  • అవినీతికి ఆది పురుషుడు జగన్మోహన్ రెడ్డేనని తీవ్ర విమర్శ
  • వైసీపీ హయాంలో రూ.2 కోట్ల విలువైన తలనీలాల స్మగ్లింగ్ జరిగిందని ఆరోపణ
  • దేవుడి సొమ్ము దోచేసిన వారిని ప్రజలు క్షమించరని హెచ్చరిక
మాజీ ముఖ్యమంత్రి జగన్ పై రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమల పరకామణిలో జరిగిన దొంగతనాన్ని జగన్ సమర్థించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యకు గాను జగన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

వైసీపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా హిందూ మతంపై దాడి చేయడమే వారి ఏకైక ఎజెండా అని బుచ్చి రాంప్రసాద్ ఆరోపించారు. వైసీపీ హయాంలో రూ.2 కోట్ల విలువైన తలనీలాలను మయన్మార్, థాయ్‌లాండ్ మీదుగా చైనాకు అక్రమంగా తరలిస్తుండగా అస్సాం రైఫిల్స్ పట్టుకున్నాయని గుర్తుచేశారు. "అవినీతికి ఆది పురుషుడు జగన్మోహన్ రెడ్డే. రాజకీయ అవినీతిపై పీహెచ్‌డీ చేయాలంటే జగన్‌కే మొదటి ర్యాంక్ వస్తుంది," అని ఆయన ఎద్దేవా చేశారు.

పన్నెండేళ్లుగా బెయిల్‌పై ఉంటూ రాజకీయాలు చేస్తున్న వ్యక్తికి, పరకామణిలో దేవుడి సొమ్ము దొంగతనం చేయడం ఒక చిన్న తప్పుగా కనిపిస్తోందని విమర్శించారు. దొంగతనాన్ని లోక్ అదాలత్‌లో సెటిల్‌మెంట్ చేసుకోవడం అనే కొత్త సిద్ధాంతాన్ని వైసీపీ తెరపైకి తెచ్చిందని దుయ్యబట్టారు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు, తన హయాంలో వేల కోట్లు దోపిడీ చేసి, ఆ అవినీతిని చట్టబద్ధం చేయడం జగన్‌కు అలవాటుగా మారిందని ఆరోపించారు.

"బాబాయ్ గొడ్డలిపోటు రహస్యాలు తెలిసిన వారి కథ ఎలా ముగిసిందో, పరకామణి కేసులో కూడా అదే జరుగుతోంది. దేవుడినే దోచేస్తే కలియుగ స్వామి ఊరుకుంటాడా? త్వరలోనే ఈ కేసులో గజదొంగల చరిత్ర వెలుగులోకి వస్తుంది. దేవుడి సొమ్ము దోచేసిన వైసీపీ దొంగలను ప్రజలు క్షమించరు" అని బుచ్చి రాంప్రసాద్ హెచ్చరించారు.


More Telugu News