టీ20ల్లో రికార్డు సృష్టించిన స్మృతి మంధాన‌.. 'రో-కో' త‌ర్వాత తనే!

అంత‌ర్జాతీయ టీ20ల్లో భార‌త మ‌హిళ క్రికెట‌ర్ స్మృతి మంధాన అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకుంది.  టీ20లలో 4000 పరుగులు దాటిన రెండవ మహిళా క్రికెటర్‌గా ఆమె నిలిచింది. నిన్న‌ శ్రీలంక‌తో జ‌రిగిన‌ తొలి టీ20లో ఆమె ఈ ఘ‌న‌త‌ను సాధించింది. విశాఖపట్నం వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్‌లో 25 పరుగులు చేసిన స్మృతి ఈ రికార్డును న‌మోదు చేసింది. స్మృతి 154 మ్యాచుల్లో 4007 ర‌న్స్ చేసింది. ఇందులో ఒక సెంచ‌రీతో పాటు 31 అర్ధ సెంచ‌రీలు ఉన్నాయి. ఓవ‌రాల్‌గా ఈ జాబితాలో కివీస్ ప్లేయ‌ర్ సుజీ బేట్స్ 4,716 ప‌రుగుల‌తో తొలి స్థానంలో ఉంది.  

మొత్తం మీద టీ20 క్రికెట్‌లో పురుషులు, మహిళలు కలిపి ఐదుగురు మాత్రమే 4000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేశారు. భారత దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పాటు బేట్స్, పాకిస్థాన్‌కు చెందిన బాబర్ ఆజం సహా స్మృతి ఈ జాబితాలో చేరింది. ఇక‌, ఈ జాబితాలో మంధాన అతి పిన్న వయస్కురాలు కావ‌డంతో భవిష్యత్తులో అగ్రస్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది.

టీ20ల్లో అత్యధిక పరుగులు (పురుషులు, మహిళలు)
సుజీ బేట్స్ (న్యూజిలాండ్‌) - 4716
బాబర్ ఆజం (పాక్) - 4429
రోహిత్ శర్మ (భార‌త్‌) - 4231
విరాట్ కోహ్లీ (భార‌త్‌) - 4188
స్మృతి మంధాన (భార‌త్‌) - 4007*


More Telugu News