సరళమైన చట్టాలు, నమ్మకంతో కూడిన పాలనతోనే దేశాభివృద్ధి: నిర్మలా సీతారామన్

  • సరళమైన చట్టాలతోనే దేశాభివృద్ధి సాధ్యమన్న నిర్మలా సీతారామన్
  • కర్ణాటకలోని హంపిలో ఆర్థిక శాఖ ‘చింతన్ శిబిర్’
  • నమ్మకంపై ఆధారపడిన పాలనా వ్యవస్థకు ప్రాధాన్యం
  • పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై చర్చ
  • వికసిత భారత్ లక్ష్య సాధనకు సంస్కరణలు అవసరం
భారతదేశాన్ని ‘వికసిత భారత్’గా మార్చే ప్రక్రియను వేగవంతం చేయాలంటే సరళమైన చట్టాలు, నమ్మకంపై ఆధారపడిన పాలన చాలా కీలకమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వ్యాపార విధానాలను సులభతరం చేయడం, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారానే సమ్మిళిత వృద్ధి సాధ్యమవుతుందని ఆమె స్పష్టం చేశారు.

కర్ణాటకలోని విజయనగర జిల్లా హంపిలో ఆదివారం జరిగిన కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖల ‘చింతన్ శిబిర్’లో ఆమె మాట్లాడారు. ఈ సమావేశంలో రెండు మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, సీబీడీటీ, సీబీఐసీ చైర్మన్లు, ముఖ్య ఆర్థిక సలహాదారు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రస్తుతం ఉన్న సంక్లిష్టమైన చట్టాలను సరళతరం చేయాలని, ప్రజలు, సంస్థలపై అనుమానంతో కాకుండా నమ్మకంతో కూడిన పాలన అందించాలని మంత్రి సూచించారు. పన్ను ఎగవేతలను గుర్తించడం, విధాన నిర్ణయాల్లో పారదర్శకత పెంచడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై కూడా ఈ శిబిర్‌లో చర్చించారు.

విజయనగర సామ్రాజ్యం సాధించిన విజయాలను గుర్తుచేస్తూనే, ప్రస్తుత అభివృద్ధి సవాళ్లను ఎదుర్కోవాల్సిన అవసరాన్ని ఆమె నొక్కిచెప్పారు. వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరిచి, దేశ ఆర్థిక ప్రగతికి అవసరమైన సంస్కరణలను వేగంగా అమలు చేయడమే ఈ చర్చల ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.


More Telugu News