రూ. 14.61 కోట్ల సైబర్ మోసం... నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు!

  • సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన హైదరాబాద్ వైద్యుడు 
  • సైబర్ క్రిమినల్స్‌కు మ్యూల్ బ్యాంక్ ఖాతాలు సమకూర్చిన నిందితులు 
  • నిందితుల కస్టడీ కోరుతూ కోర్టులో పోలీసుల పిటిషన్
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన భారీ సైబర్ మోసం కేసులో కీలక ముందడుగు పడింది. నకిలీ పెట్టుబడుల పేరుతో ఓ వైద్యుడి నుంచి ఏకంగా రూ.14.61 కోట్లు కొల్లగొట్టిన ఘటనలో నలుగురు నిందితులను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర చరిత్రలో ఒకే వ్యక్తి ఇంత భారీ మొత్తంలో మోసపోవడం ఇదే మొదటిసారి కావడంతో ఈ కేసు దర్యాప్తును అధికారులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.

ఈ కేసుకు సంబంధించి ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన బ్రహ్మినాయుడు, పవన్, మణిరామ్, శివకృష్ణను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన సైబర్ నేరగాళ్లకు వీరంతా మ్యూల్ బ్యాంక్ ఖాతాలు సమకూర్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వైద్యుడి నుంచి కాజేసిన డబ్బును ఈ ఖాతాల ద్వారానే ప్రధాన నిందితులు బదిలీ చేసుకున్నట్లు గుర్తించారు.

అరెస్ట్ చేసిన నలుగురు నిందితులను మరింత లోతుగా విచారించేందుకు ఐదు రోజుల కస్టడీకి అనుమతించాలని కోరుతూ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం కోర్టు తన నిర్ణయాన్ని వెలువరించనుంది. నిందితుల విచారణ ద్వారా ఈ సైబర్ మోసం వెనుక ఉన్న ప్రధాన సూత్రధారుల గుట్టు రట్టు చేయవచ్చని సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు.


More Telugu News