మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేయాలో జగన్‌కు పక్కా ప్లాన్ ఉంది: సజ్జల

  • అధికారంలో ఉన్నా లేకపోయినా జనం జగన్ వెంటే ఉన్నారన్న సజ్జల
  • ఐదేళ్ల పాలనలో ప్రజలకు చేయాల్సినంత చేశారని ప్రశంస
  • ప్రచారం ఆశించకుండా ఎన్నో అభివృద్ధి పనులు చేశారని కితాబు
వైసీపీ అధినేత జగన్ తన ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఎంత మేలు చేయాలో అంతా చేశారని, మళ్లీ అధికారంలోకి రాగానే చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా ఆయనకు స్పష్టమైన ప్రణాళిక ఉందని ఆ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లి సమీపంలోని కుంచనపల్లిలో జరిగిన జగన్ పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి, అనంతరం మీడియాతో మాట్లాడారు.

అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలు జగన్ వెంటే ఉంటారని సజ్జల ధీమా వ్యక్తం చేశారు. "ప్రజలకు మేలు చేసేది జగన్ ఒక్కరేనని కోట్లాది మంది నమ్ముతున్నారు. అందుకే తన ఐదేళ్ల పాలనలో అందరికీ మేలు చేశారు. ఏదో ఆశించి ఆయన సహాయం చేయరు. తన వల్ల ప్రజలకు ఎంత మంచి జరుగుతుందనే నిత్యం ఆలోచిస్తారు" అని తెలిపారు. ఓదార్పు యాత్ర సమయంలోనూ, కరోనా కష్టకాలంలోనూ జగన్ ప్రజలకు అండగా నిలిచిన తీరును సజ్జల గుర్తుచేశారు.

జగన్ ఏనాడూ పబ్లిసిటీ కోరుకోలేదని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి కాలనీలు సృష్టించారని, 17 మెడికల్ కాలేజీలు, పోర్టులు, హార్బర్లు వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా ప్రచారం చేసుకోలేదని అన్నారు. చంద్రబాబు తన 18 నెలల పాలనలోనే రూ.2.70 లక్షల కోట్లు అప్పు చేశారని, కానీ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఆర్థికవేత్తలే ఆశ్చర్యపోయేలా జగన్ తన ఐదేళ్ల పాలనను సాగించారని సజ్జల ప్రశంసించారు.


More Telugu News

Jagan Mohan Reddy YS Jagan Jagan Birthday Sajjala Ramakrishna Reddy YSRCP Andhra Pradesh Politics AP Elections 2024 Chandrababu Naidu Welfare Schemes Medical Colleges