ఇది కేవలం తెలుగు సినిమా మాత్రమే కాదు: బాలకృష్ణ

  • 'అఖండ 2' సనాతన ధర్మాన్ని చాటిచెప్పిన చిత్రమన్న బాలయ్య
  • ఇది కేవలం తెలుగు సినిమా కాదని, భారతీయుల చిత్రమని వ్యాఖ్య
  • 'అఖండ 2' విజయం తర్వాత కాశీ విశ్వనాథుని దర్శించుకున్న చిత్రబృందం
  • దర్శకుడు బోయపాటితో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు
  • సినిమాను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అభినందించారని వెల్లడి
తమ 'అఖండ 2' చిత్రం కేవలం ఒక తెలుగు సినిమా మాత్రమే కాదని, సనాతన హైందవ ధర్మ పరిరక్షణ ఆవశ్యకతను చాటిచెప్పిన భారతీయులందరి చిత్రమని నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. 'అఖండ 2' సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి ఆయన వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ, బోయపాటి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ‘‘మంచి సినిమా కోసం మేము చేసిన ప్రయత్నం ఫలించింది. చిత్రాన్ని ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని తెలిపారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిసిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. భక్తి, ధర్మం ప్రధానాంశాలుగా సినిమాను రూపొందించినందుకు సీఎం తమను ప్రత్యేకంగా అభినందించారని బాలకృష్ణ వివరించారు.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన 'అఖండ 2' ఈనెల 12న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటికే హైదరాబాద్‌లో విజయోత్సవ సభ నిర్వహించిన చిత్ర బృందం, ప్రస్తుతం ఉత్తరాదిలో విడుదల అనంతర ప్రమోషన్ కార్యక్రమాలు చేపడుతోంది. 


More Telugu News