Adani Group: ఎయిర్‌పోర్ట్ వ్యాపారంపై అదానీ గ్రూప్ భారీ ప్లాన్... లక్ష కోట్ల పెట్టుబడి

Jeet Adani Adani Group Plans Massive Investment in Airport Business
  • ఐదేళ్లలో విమానాశ్రయాల వ్యాపారంలో లక్ష కోట్ల పెట్టుబడి
  • ఈ నెల‌ 25న నవీ ముంబై ఎయిర్‌పోర్ట్ వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం
  • ముంబై విమానాశ్రయంపై భారం తగ్గించనున్న కొత్త ఎయిర్‌పోర్ట్
  • భారత ఏవియేషన్ రంగం 15-16 శాతం వృద్ధి చెందుతుందని అంచనా
  • తదుపరి విడత ప్రైవేటీకరణలో 11 ఎయిర్‌పోర్ట్‌ల కోసం దూకుడుగా బిడ్డింగ్
భారత ఏవియేషన్ రంగంలో వృద్ధి అవకాశాలపై బలమైన విశ్వాసంతో ఉన్న అదానీ గ్రూప్, తమ విమానాశ్రయాల వ్యాపారంలో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. రాబోయే ఐదేళ్లలో ఏకంగా రూ.1 లక్ష కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు అదానీ ఎయిర్‌పోర్ట్స్ డైరెక్టర్, గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ వెల్లడించారు.

ఈ నెల 25న నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించనున్న నేపథ్యంలో పీటీఐతో మాట్లాడుతూ ఆయన ఈ కీలక వివరాలు తెలియ‌జేశారు. నవీ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అదానీ గ్రూప్‌కు 74 శాతం వాటా ఉంది. రూ.19,650 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ విమానాశ్రయం మొదటి దశలో ఏటా 2 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. భవిష్యత్తులో దీని సామర్థ్యాన్ని 9 కోట్ల మందికి పెంచనున్నారు. ఇది ప్రస్తుత ముంబై విమానాశ్రయంపై భారాన్ని తగ్గించనుంది.

భారత ఏవియేషన్ రంగం రాబోయే 10-15 ఏళ్లపాటు ఏటా 15-16 శాతం చొప్పున స్థిరంగా వృద్ధి చెందే సత్తా ఉందని జీత్ అదానీ ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టబోయే తదుపరి విడత విమానాశ్రయాల ప్రైవేటీకరణలో కూడా దూకుడుగా పాల్గొంటామని, 11 ఎయిర్‌పోర్ట్‌ల కోసం బిడ్ దాఖలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం ముంబై, నవీ ముంబైతో పాటు అహ్మదాబాద్, లక్నో, గువాహ‌టి, జైపూర్ వంటి ఆరు ఇతర విమానాశ్రయాలను అదానీ గ్రూప్ నిర్వహిస్తోంది. దేశంలోని మొత్తం ప్రయాణికులలో దాదాపు 23 శాతం మంది అదానీ గ్రూప్ విమానాశ్రయాల ద్వారానే ప్రయాణిస్తున్నారు.
Adani Group
Jeet Adani
airport business
aviation sector
Navi Mumbai International Airport
airport privatization
Indian aviation
airport investment
Gautam Adani
Mumbai airport

More Telugu News