Babita Das: డిజిటల్ అరెస్ట్... ప్లాట్‌లు అమ్మి మరీ రూ.2 కోట్లు పోగొట్టుకున్న మహిళా టెక్కీ

Babita Das Loses 2 Crores in Digital Arrest Fraud
షార్ట్స్‌లో చూడండి
బెంగళూరుకు చెందిన ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ డిజిటల్ అరెస్టు భయంతో రూ.2 కోట్లు నష్టపోయింది. సైబర్ నేరగాళ్లకు ఆ డబ్బు చెల్లించడానికి ఆమె రెండు ప్లాట్‌లు, ఒక ఫ్లాట్ విక్రయించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా, బెంగళూరు పోలీసులు దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. బబితా దాస్ అనే మహిళ బెంగళూరు నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమెక పదేళ్ల కుమారుడు ఉన్నాడు.

ఈ ఏడాది జూన్‌లో ఒక వ్యక్తి కొరియర్ అధికారిగా పరిచయం చేసుకుని బబితకు ఫోన్ చేశాడు. ఆమె ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు వివరాలతో అనుసంధానమై ఉన్న పార్సిల్‌లో అనుమానాస్పద వస్తువులు ఉన్నట్లు తెలియజేశాడు.

ఆ తర్వాత మరికొందరు ముంబైకి చెందిన వ్యక్తులమని చెప్పి ఆమెకు ఫోన్ చేశారు. అనుమానాస్పద వస్తువులు గురించి ప్రస్తావిస్తూ, ఆమె డిజిటల్ అరెస్టయినట్లు తెలిపారు. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోందని, అది పూర్తయ్యే వరకు ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించారు.

వారు సూచించిన ఒక మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని, లేదంటే ఆమె కుమారుడు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించారు. యాప్‌ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత, ఆమె ఖాతా వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన కుమారుడి భవిష్యత్తు గురించి భయపడిన ఆ టెక్కీ అన్ని వివరాలు వారికి వెల్లడించింది.

వారికి డబ్బు చెల్లించడానికి ఆమె రెండు ప్లాట్‌లు, ఒక ఫ్లాట్ అమ్మేసింది. ఆ మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు సూచించిన బ్యాంకు ఖాతాకు పంపించింది. సైబర్ నేరగాళ్లు మరింత డబ్బు డిమాండ్ చేయడంతో బ్యాంకు నుంచి రుణం తీసుకుని మరీ చెల్లించింది.

చివరగా, ఆమెకు ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు చెల్లించిన డబ్బు తిరిగి పొందడానికి సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు. ఆ తర్వాత వారికి ఫోన్ చేయడానికి ప్రయత్నించగా ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో బబిత వైట్‌ఫీల్డ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Babita Das
Digital Arrest
Cyber Crime
Bangalore
Software Engineer
Online Fraud

More Telugu News