సంక్రాంతి సీజన్... రైళ్లన్నీ దాదాపు ఫుల్!

  • సంక్రాంతి పండుగకు నెల ముందే ఫుల్ అయిన రైళ్లు
  • భారీగా వెయిటింగ్ లిస్ట్.. కొన్ని రైళ్లలో 'రిగ్గ్రెట్' బోర్డులు
  • విశాఖ, ఉత్తరాంధ్ర వెళ్లేవారికి తీవ్ర నిరాశ
  • ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్న ప్రయాణికులు
సంక్రాంతి పండుగకు స్వస్థలాలకు వెళ్లాలనుకునేవారికి రైల్వే శాఖ నుంచి నిరాశ తప్పలేదు. పండుగకు నెల రోజుల సమయం ఉండగానే ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే రైళ్లలో బెర్తులన్నీ నిండిపోయాయి. ప్రస్తుతం ఏ రైలులో రిజర్వేషన్ కోసం ప్రయత్నించినా భారీ వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తోంది. కొన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ కూడా దాటిపోయి 'రిగ్గ్రెట్' అని చూపిస్తుండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

ఉద్యోగ, వ్యాపారాల హడావిడిలో ముందుగా టికెట్లు బుక్ చేసుకోలేకపోయిన వారు ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విశాఖపట్నం, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. దాదాపు 12 గంటల సుదూర ప్రయాణం కావడంతో ఎక్కువ మంది రైళ్లకు ప్రాధాన్యతనిస్తారు. అయితే రెండు నెలల క్రితమే సాధారణ, ప్రత్యేక రైళ్లలో రిజర్వేషన్లు పూర్తయినట్లు తెలుస్తోంది.

ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి పునరావృతం అవుతుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. రైళ్లలో బెర్తులు దొరకని కారణంగా చాలామంది బస్సులు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూడాల్సి వస్తోంది. 


More Telugu News