మెస్సీ వ్యవహారం.. అసలు దోషి అతడే: గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు

  • కోల్‌కతాలో అర్జెంటీనా స్టార్ మెస్సీ పర్యటనలో తీవ్ర గందరగోళం
  • అభిమానులకు కనిపించకుండా చుట్టుముట్టిన వీఐపీలు, అధికారులు
  • నిర్వాహకులను నిందించే ముందు అసలు దోషి ఎవరో చూడాలన్న గవాస్కర్
  • ఒప్పందం ప్రకారం మెస్సీ నడుచుకున్నాడా? అని ప్రశ్నించిన మాజీ క్రికెటర్
  • గంట సేపు ఉండాల్సిన మెస్సీ 22 నిమిషాల్లోనే వెనుదిరగడంపై విమర్శలు
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ భారత పర్యటనలో భాగంగా కోల్‌కతాలో జరిగిన గందరగోళంపై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో అందరూ నిర్వాహకులను తప్పుబడుతున్నారని, కానీ అసలు దోషి మెస్సీనే కావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అభిమానులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో మెస్సీ విఫలమయ్యాడని విమర్శించారు.

ఈ నెల 13న కోల్‌కతాలోని యువ భారతి క్రీడాంగణంలో జరిగిన కార్యక్రమంలో మెస్సీ అభిమానులకు సరిగా కనిపించకపోవడంతో తీవ్ర గందరగోళం చెలరేగిన సంగతి తెలిసిందే. అభిమానులు కుర్చీలు, బాటిళ్లు విసిరి స్టేడియం ఆస్తులను ధ్వంసం చేశారు. దీనిపై గవాస్కర్ స్పందిస్తూ "మెస్సీకి, నిర్వాహకులకు మధ్య ఎలాంటి ఒప్పందం జరిగిందో బయటకు తెలియదు. కానీ, అతడు స్టేడియంలో గంట సేపు ఉండటానికి బదులు ముందే వెళ్లిపోవడం ద్వారా అభిమానులను నిరాశపరిచాడు. కాబట్టి అసలు దోషి మెస్సీ, అతడి బృందమే" అని తన కాలమ్‌లో పేర్కొన్నారు.

ఆ రోజు మెస్సీ చుట్టూ రాజకీయ నాయకులు, వీఐపీలు ఉన్న మాట వాస్తవమే అయినా, ఆయన భద్రతకు ఎలాంటి ముప్పు లేదని గవాస్కర్ గుర్తుచేశారు. "మొదట అనుకున్న ప్రకారం, మెస్సీ స్టేడియం చుట్టూ నడిచి వెళ్లాలా? లేక పెనాల్టీ కిక్ వంటివి తీయాలా? ఒకవేళ పెనాల్టీ కిక్ తీయాల్సి ఉంటే, అతడి చుట్టూ ఉన్నవారు పక్కకు తప్పుకునేవారు. అభిమానులు కూడా తమ హీరోను చూసి ఆనందించేవారు" అని వివరించారు.

మెస్సీ పర్యటనలోని హైదరాబాద్, ముంబై, ఢిల్లీ కార్యక్రమాలు సజావుగా సాగాయని, ఎందుకంటే అక్కడ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని గవాస్కర్ అన్నారు. కోల్‌కతాలో భారతీయులైన నిర్వాహకులను నిందించే ముందు, ఇరుపక్షాలు తమ ఒప్పందాలను గౌరవించాయో లేదో పరిశీలించాలని ఆయన సూచించారు.


More Telugu News