జీహెచ్ఎంసీ డివిజన్ల పెంపును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

  • పిటిషన్ దాఖలు చేసిన వినయ్ కుమార్ అనే వ్యక్తి
  • పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని హైకోర్టును కోరిన పిటిషనర్
  • పునర్విభజనలో అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలన్న పిటిషనర్
జీహెచ్ఎంసీ డివిజన్ల పెంపును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వినయ్ కుమార్ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి విచారణ చేపట్టారు.

డివిజన్ల పునర్విభజనలో అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని వినయ్ కుమార్ పేర్కొన్నారు. రాంనగర్ డివిజన్‌పై తన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు. అనంతరం ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

మేయర్‌తో కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల భేటీ

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో నగరానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఎక్స్‌-అఫీషియో సభ్యులు సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అరికెపూడి గాంధీ, ప్రకాశ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌లతో కలిసి కార్పొరేటర్లు మేయర్‌తో భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనపై ఆమెతో చర్చించారు.

అనంతరం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ, డివిజన్ల సరిహద్దులపై మార్కింగ్ చేసి వినతిపత్రం అందజేశామని తెలిపారు. ఏ ప్రాతిపదికన డివిజన్ల పునర్విభజన చేశారో చెప్పాలని కోరామని అన్నారు.

హైదరాబాద్‌లో డివిజన్ల పునర్విభజనకు ఆదేశిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నగరాన్ని 300 డివిజన్లుగా విభజించారు. ఆయా డివిజన్లకు హద్దులను ప్రకటిస్తూ కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం గెజిట్ ప్రచురించింది.


More Telugu News