తన మాజీ భర్త దిలీప్ ను కోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై నటి మంజు వారియర్ సంచలన వ్యాఖ్యలు

  • నటిపై లైంగిక దాడి కేసు తీర్పుపై స్పందించిన మంజు వారియర్
  • బాధితురాలికి న్యాయం ఇంకా అసంపూర్ణంగానే ఉందని వ్యాఖ్య
  • అసలు సూత్రధారులు బయట తిరుగుతున్నారని ఆందోళన
ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్, 2017 నాటి 'నటిపై లైంగిక దాడి' కేసు తీర్పుపై స్పందించారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి గౌరవం ఉన్నప్పటికీ, బాధితురాలికి న్యాయం ఇంకా అసంపూర్తిగానే ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొని, నిర్దోషిగా విడుదలైన నటుడు దిలీప్, మంజు వారియర్ మాజీ భర్త కావడం గమనార్హం.

తీర్పు వెలువడిన దాదాపు వారం రోజుల తర్వాత, మంజు వారియర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సుదీర్ఘమైన నోట్ పంచుకున్నారు. "గౌరవనీయ న్యాయస్థానంపై నాకు అపారమైన గౌరవం ఉంది. కానీ ఈ కేసులో బాధితురాలికి న్యాయం ఇంకా పూర్తి కాలేదు. కేవలం నేరం చేసిన వారికి మాత్రమే శిక్ష పడింది. ఈ ఘోరానికి ప్రణాళిక రచించి, అమలు చేసిన అసలు సూత్రధారి ఎవరైనా సరే, వారు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఇది చాలా భయానకం" అని ఆమె పేర్కొన్నారు.

ఈ నేరం వెనుక ఉన్న ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెట్టినప్పుడే న్యాయం పూర్తవుతుందని మంజు స్పష్టం చేశారు. "ఇది కేవలం ఒక బాధితురాలి సమస్య కాదు. కార్యాలయాల్లో, వీధుల్లో, జీవితంలో ధైర్యంగా, నిర్భయంగా తలెత్తుకుని నడవాలనుకునే ప్రతి అమ్మాయి, ప్రతి మహిళ కోసం నేను మాట్లాడుతున్నాను. నేను ఆమెతో పాటు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ ఉంటాను" అని ఆమె తన పోస్టులో తేల్చి చెప్పారు.

ఎర్నాకుళం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ఈ కేసులో దిలీప్‌ను నిర్దోషిగా ప్రకటించగా, ప్రధాన నిందితుడు సహా మరో ఆరుగురిని దోషులుగా నిర్ధారించిన విషయం తెలిసిందే.


More Telugu News