ఐదేళ్లలో ఎన్ని లక్షల మంది భారతీయులు భారత పౌరసత్వాన్ని వదులుకున్నారంటే?

  • భారత పౌరసత్వం విషయంలో పార్లమెంటులో ప్రశ్న
  • రాజ్యసభలో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి
  • పౌరసత్వాన్ని వదులుకునే వ్యక్తుల రికార్డులను ప్రభుత్వం భద్రపరుస్తోందని వెల్లడి
గత ఐదు సంవత్సరాలలో ఎంతమంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులకున్నారో తెలుసా...? ఈ ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పింది. గత ఐదేళ్ల కాలంలో దాదాపు 9 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలియజేసింది. ఈ డేటాను విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఇచ్చారు. భారత పౌరసత్వం విషయంలో పార్లమెంటులో అడిగిన ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానంలో ఈ డేటాను వెల్లడించారు.

భారత పౌరసత్వాన్ని వదులుకునే వ్యక్తుల వార్షిక రికార్డులను ప్రభుత్వం భద్రపరుస్తోందని ఆయన అన్నారు. ఆ రికార్డుల ప్రకారం 2011-19 మధ్య 11,89,194 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. గత 14 సంవత్సరాలలో 20 లక్షలకు పైగా ప్రజలు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు.

విదేశీ పౌరసత్వాన్ని ఎంచుకునే భారతీయుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోందని విదేశాంగ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఐదేళ్ల కాలంలో 9 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పేర్కొన్నారు.

గల్ఫ్‌లో ఉద్యోగాల పేరిట మోసం

విదేశాలలో ఉద్యోగాలు చేయాలని కలలు కంటున్న పలువురు భారత యువతీ యువకులు మోసపూరిత ఉద్యోగ ఆఫర్ల బారిన పడుతున్నారని విదేశాంగ శాఖ వెల్లడించింది. గల్ఫ్ దేశాలలో ఉద్యోగాల కోసం భారత యువత నకిలీ గల్ఫ్ ఉద్యోగ ఆఫర్లకు ఆకర్షితులై అక్రమ రవాణా నెట్ వర్క్‌ల బారిన పడుతున్నారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇటువంటి కేసులు తమ దృష్టికి వచ్చాయని అన్నారు. ఇందులో చాలా వరకు సోషల్ మీడియాలో ఉద్యోగ ఆఫర్లను నమ్మడంతోనే ప్రారంభమవుతోందని అన్నారు.


More Telugu News