Sumita Ayodhya: తెలంగాణలో జెన్ జీ పోస్ట్ ఆఫీస్

Sumita Ayodhya Launches Gen Z Post Office in Warangal NIT Telangana
  • వరంగల్ ఎన్ఐటీలో రాష్ట్రంలోనే తొలి జెన్-టి పోస్టాఫీస్
  • విద్యార్థుల కోసం ఆధునిక సేవలతో ప్రత్యేక ఏర్పాటు
  • స్పీడ్ పోస్టులో రాయితీలు, డిజిటల్ చెల్లింపులు, ఉచిత వైఫై
  • నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సబూధి చేతుల మీదుగా ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా విద్యార్థులకు ఆధునిక, వేగవంతమైన సేవలను అందించే లక్ష్యంతో 'జెన్-టి' థీమ్ పోస్టాఫీసును వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (ఎన్ఐటీ)లో ఏర్పాటు చేశారు. హైదరాబాద్ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ సుమిత అయోధ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ నూతన కార్యాలయాన్ని ఎన్ఐటీ డైరెక్టర్ ఆచార్య బిద్యాధర్ సబూధి నిన్న ప్రారంభించారు.

ఈ సందర్భంగా బిద్యాధర్ సబూధి మాట్లాడుతూ, విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఇలాంటి వినూత్న కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

పోస్ట్ మాస్టర్ జనరల్ సుమిత అయోధ్య మాట్లాడుతూ, ఈ పోస్టాఫీసులో బ్యాంకింగ్ సేవలు, పార్సిల్ బుకింగ్, క్యూఆర్ కోడ్ ఆధారిత చెల్లింపులు, బీమా, ఆధార్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థుల కోసం స్పీడ్ పోస్ట్‌పై ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నామని, ఉచిత వైఫై సౌకర్యం కూడా ఉందని వివరించారు. అనంతరం అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులకు నూతన సేవలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఎన్ఐటీ రిజిస్ట్రార్ ఆచార్య సునీల్ కుమార్ మెహతా, హనుమకొండ తపాలా కార్యాలయ సూపరింటెండెంట్ నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. 
Sumita Ayodhya
Telangana
Warangal NIT
Gen Z Post Office
India Post
Postal Services
Student Services
Banking Services
Aadhar Services
Speed Post

More Telugu News