ఇండిగోను తక్షణమే జాతీయం చేయండి: సీపీఐ నారాయణ
- విమానాల రద్దు, ఆలస్యంపై ఇండిగోకు కేంద్రం షాక్
- ఫ్లైట్ స్లాట్లలో 5 శాతం కోత విధించిన డీజీసీఏ
- ఇండిగో యాజమాన్యం బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందన్న నారాయణ
డీజీసీఏ తాజా నిర్ణయంతో ఇండిగో నడిపే విమానాల సంఖ్యలో సుమారు 110 సర్వీసులు తగ్గే అవకాశం ఉంది. ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, ఇండిగో వైఖరిపై రాజకీయ నేతల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సీపీఐ అగ్రనేత నారాయణ ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. ఇండిగో సంస్థను తక్షణమే జాతీయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రయాణికుల భద్రత కోసం కేంద్రం విధించిన నిబంధనలను పాటించకుండా ఇండిగో యాజమాన్యం బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. పౌర విమానయాన రంగంలో ఇండిగోకు 64 శాతం వాటా ఉందని, ప్రభుత్వ రంగంలో విమానయాన సంస్థలు లేకపోవడం వల్లే ఇలాంటి సంక్షోభాలు తలెత్తుతున్నాయని నారాయణ విమర్శించారు.