కోనసీమకు దిష్టి తగిలిందన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి నాదెండ్ల మనోహర్

  • పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరించారన్న మంత్రి నాదెండ్ల
  • రైతులతో మాట్లాడే సందర్భంలోనే అలా అన్నారని వివరణ 
  • ఆ వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టీకరణ
  • తెలంగాణ ప్రజలంటే పవన్‌కు ఎంతో గౌరవం అని వెల్లడి
  • ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని సూచన
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన "కోనసీమకు తెలంగాణ నేతల దిష్టి తగిలింది" అనే వ్యాఖ్యలు ఎంతటి రాజకీయ దుమారం రేపాయో తెలిసిందే. తెలంగాణ మంత్రులు ముక్తకంఠంతో పవన్ వ్యాఖ్యలను ఖండించారు. విపక్ష నేతలు కూడా పలువురు పవన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను కొన్ని వర్గాలు ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తున్నాయని అన్నారు.

పవన్ కల్యాణ్ ఎటువంటి దురుద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కేవలం రైతులతో మాట్లాడే సందర్భంలో మాత్రమే అలా అన్నారని వివరించారు. ఈ చిన్న విషయాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

పవన్ కల్యాణ్‌కు తెలంగాణ ప్రజలపై ఎంతో ప్రేమ, నమ్మకం ఉన్నాయని నాదెండ్ల గుర్తుచేశారు. గతంలో అనేక సందర్భాలలో ఆయన తెలంగాణ ప్రజలను, వారి పోరాట స్ఫూర్తిని ప్రశంసించారని తెలిపారు. కాబట్టి, ఈ వ్యాఖ్యలను అపార్థం చేసుకోవద్దని, దీనిపై వివాదం సృష్టించవద్దని మంత్రి నాదెండ్ల కోరారు.


More Telugu News