విమానాల రద్దుపై డీజీసీఏ ఫైర్... ఇండిగో అకౌంటబుల్ మేనేజర్‌కు షోకాజ్ నోటీసు

  • విమానాల రద్దుపై ఇండిగోకు డీజీసీఏ ఫైర్
  • 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని డీజీసీఏ ఆదేశం
  • కొత్త FDTL నిబంధనల అమలులో వైఫల్యమే కారణం
ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తూ భారీ సంఖ్యలో విమానాలను రద్దు చేస్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్‌కు నోటీసులు జారీ చేసిన ఒక రోజు వ్యవధిలోనే, తాజాగా ఆదివారం ఇండిగో అకౌంటబుల్ మేనేజర్‌కు కూడా షోకాజ్ నోటీసు ఇచ్చింది.

విమాన సిబ్బంది పనివేళలు, విశ్రాంతి సమయాలను నియంత్రించే కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనలను సజావుగా అమలు చేయడానికి సరైన ఏర్పాట్లు చేయడంలో ఇండిగో విఫలమైందని డీజీసీఏ తన నోటీసులో స్పష్టం చేసింది. ప్రణాళిక, పర్యవేక్షణ, వనరుల నిర్వహణలో తీవ్రమైన లోపాల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొంది.

ఈ వైఫల్యం వల్ల ఇండిగో సంస్థ ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్, 1937లోని రూల్ 42ఏతో పాటు సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్స్‌ (CAR) లోని పలు నిబంధనలను ఉల్లంఘించినట్లు డీజీసీఏ గుర్తించింది. విమానాలు రద్దయినప్పుడు ప్రయాణికులకు నిబంధనల ప్రకారం అవసరమైన సహాయం, సౌకర్యాలు కల్పించడంలో కూడా విఫలమైందని తెలిపింది.

ఈ ఉల్లంఘనలపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని అకౌంటబుల్ మేనేజర్‌ను డీజీసీఏ ఆదేశించింది. గడువులోగా స్పందించకపోతే అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు, తాము రోజుకు 1,500 విమానాలు నడుపుతున్నామని, 95 శాతం నెట్‌వర్క్‌ను పునరుద్ధరించామని ఇండిగో ప్రకటించింది. అయినప్పటికీ, ఆదివారం కూడా దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో విమానాలు రద్దవడంతో ప్రయాణికుల కష్టాలు కొనసాగుతున్నాయి.


More Telugu News