విశాఖలో సత్తా చాటిన భార‌త‌ బౌలర్లు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..!

  • మూడో వన్డేలో దక్షిణాఫ్రికాను 270 పరుగులకు కట్టడి చేసిన భారత్
  • చెరో నాలుగు వికెట్ల‌తో రాణించిన‌ ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్
  • సెంచరీ బాదిన సఫారీ బ్యాటర్ క్వింటన్ డికాక్ 
  • సిరీస్ గెలించేందుకు ఇరు జ‌ట్ల‌కు ఈ మ్యాచ్ కీల‌కం
విశాఖపట్నం వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెరో నాలుగు వికెట్లతో చెలరేగడంతో దక్షిణాఫ్రికా జట్టు 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియాకు 271 ప‌రుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. సఫారీ ఓపెనర్ క్వింటన్ డికాక్ (106) సెంచరీతో చెల‌రేగ‌గా... కెప్టెన్ బ‌వుమా 48 ర‌న్స్‌తో ప‌ర్వాలేద‌నిపించాడు. అయితే, భారత బౌలర్ల ధాటికి మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.

ఈ మ్యాచ్‌లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ కేఎల్ రాహుల్ తనపై ఉంచిన నమ్మకాన్ని ప్రసిద్ధ్ కృష్ణ నిలబెట్టుకున్నాడు. కీలకమైన మధ్య ఓవర్లలో మాథ్యూ బ్రీట్జ్కే, ఐడెన్ మార్‌క్రమ్‌తో పాటు సెంచరీ హీరో క్వింటన్ డికాక్‌ను ఔట్ చేసి సఫారీల పతనాన్ని శాసించాడు. తన అద్భుత బౌలింగ్‌తో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు.

ప్రసిద్ధ్ కు తోడుగా కుల్దీప్ యాదవ్ కూడా తన స్పిన్ మాయాజాలంతో ఆకట్టుకున్నాడు. అతడు కూడా 4 వికెట్లు తీసి సఫారీ బ్యాట‌ర్ల‌ను క‌ట్ట‌డి చేయ‌డంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఫీల్డింగ్‌లోనూ టీమిండియా సత్తా చాటింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుతమైన క్యాచ్‌లు అందుకుని బౌలర్లకు అండగా నిలిచారు.

సిరీస్‌ను కైవసం చేసుకోవాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. బ‌ల‌మైన బ్యాటింగ్ లైన‌ప్ క‌లిగిన భార‌త్‌కు 271 ప‌రుగుల‌ లక్ష్యాన్ని ఛేదించ‌డం పెద్ద స‌మ‌స్య కాక‌పోవ‌చ్చు. పైగా సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచు ప్ర‌భావం కూడా మ‌నోళ్ల‌కు క‌లిసొచ్చే అంశం. 


More Telugu News