అమెరికాలో ఘోర అగ్నిప్రమాదం.. గాయపడిన ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం

  • అపార్ట్‌‌మెంట్‌లో మంటలు చెలరేగడంతో తీవ్ర గాయాలు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన వైనం
  • అలబామా యూనివర్సిటీలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న యువకులు
అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించడానికి వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు ఘోర అగ్నిప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన అలబామా రాష్ట్రంలోని బర్మింగ్‌హామ్‌లో చోటు చేసుకుంది. మృతులను హైదరాబాద్‌కు చెందిన ఉడుముల సహజ రెడ్డిగా, మరొకరిని కూకట్‌పల్లి వాసిగా గుర్తించారు.

వివరాల్లోకి వెళితే, అలబామా యూనివర్సిటీలో చదువుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 13 మంది తెలుగు విద్యార్థులు బర్మింగ్‌హామ్‌లోని ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో నివాసం ఉంటున్నారు. శుక్రవారం నాడు వారు ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే దట్టమైన పొగ అపార్ట్‌మెంట్ మొత్తం వ్యాపించడంతో లోపల ఉన్న విద్యార్థులు ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి ఆర్తనాదాలు విన్న స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని, లోపల చిక్కుకున్న 13 మంది విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అయితే, ఈ ప్రమాదంలో సహజ రెడ్డితో పాటు మరో తెలుగు విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయినప్పటికీ, చికిత్స పొందుతూ వారిద్దరూ తుదిశ్వాస విడిచారని అధికారులు తెలిపారు. 

Sahaja Reddy
Alabama University
Telugu students
US fire accident
Birmingham Alabama
Indian students US
Andhra Pradesh
Telangana
Kukatpally
Apartment fire

More Telugu News