విమాన సర్వీసులు రద్దు... ఆన్‌లైన్‌లో టెక్కీ జంట రిసెప్షన్, వర్చువల్‌గా ఆశీర్వదించిన అతిథులు

  • నవంబర్ 23న మేధా క్షీరసాగర్, సంగమ్ దాస్‌ల వివాహం
  • బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా ఉద్యోగం చేస్తున్న కొత్త జంట
  • ఇండిగో విమానాలు రద్దు కావడంతో వర్చువల్‌గా రిసెప్షన్
హుబ్లీ-భువనేశ్వర్ మధ్య ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడంతో ఓ టెక్కీ జంట ఆన్‌లైన్‌లోనే రిసెప్షన్ జరుపుకుంది. ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, ఓ టెక్కీ దంపతులకు మాత్రం ఊహించని అనుభవం ఎదురైంది. ఇటీవల వివాహం చేసుకున్న ఈ నూతన దంపతులు అనివార్య కారణాల వల్ల ఆన్‌లైన్‌లో రిసెప్షన్ నిర్వహించాల్సి వచ్చింది.

కర్ణాటకలోని హుబ్లీకి చెందిన మేధా క్షీరసాగర్, ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన సంగమ్ దాస్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. నవంబర్ 23న వీరి వివాహం జరగగా, బుధవారం నాడు వధువు స్వస్థలంలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు హాజరయ్యేందుకు నూతన దంపతులు భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు ఇండిగో విమానంలో టిక్కెట్లు బుక్ చేసుకున్నారు.

అయితే, విమాన సర్వీసుల్లో అంతరాయం ఏర్పడటంతో వారి రాక సాధ్యం కాలేదు. మరోవైపు, వారి రిసెప్షన్‌కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆహ్వానితులు కూడా హాజరయ్యారు. దీంతో నూతన దంపతులు వర్చువల్‌గా రిసెప్షన్‌లో పాల్గొన్నారు. రిసెప్షన్ ఏర్పాటు చేసిన వేదికపై స్క్రీన్ ఏర్పాటు చేసి వారిని చూపించారు. హాజరైన అతిథులు వర్చువల్‌గానే నూతన దంపతులను ఆశీర్వదించారు.


More Telugu News