ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేపై 130 కిలోమీటర్ల వేగంతో గడ్కరీ కారు... లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ప్రస్తావన

  • అసోంలో రోడ్లు బాగా లేకపోవడంతో వేగంతో నడపలేకపోతున్నామన్న గౌరవ్ గొగొయ్
  • ట్యాక్స్ కడుతున్నప్పటికీ అసోంలో మంచి రహదారులు లేవన్న కాంగ్రెస్ ఎంపీ
  • వర్షాల వల్ల రహదారులు దెబ్బతిన్నాయని అంగీకరించిన నితిన్ గడ్కరీ
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రయాణిస్తున్న కారు ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ వీడియోను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నలు సంధించారు. నితిన్ గడ్కరీ జాతీయ రహదారిపై వెళుతుండగా కారు వేగం గంటకు 130 కిలోమీటర్లుగా చూపిస్తున్న వీడియోను ఆయన సభ దృష్టికి తెచ్చారు.

ఈ సందర్భంగా గౌరవ్ గొగొయ్ మాట్లాడుతూ, అసోంలో నాణ్యమైన రోడ్లు లేకపోవడం వల్ల అంత వేగంగా వాహనాలు నడపలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో నితిన్ గడ్కరీ కారులో వేగంగా వెళుతున్న వీడియో వైరల్ అయిందని, కానీ అసోంలో అలాంటి రహదారులు లేకపోవడం బాధాకరమని అన్నారు. టోల్‌గేట్లు ఉన్నప్పటికీ రోడ్ల నాణ్యత చాలా తక్కువగా ఉందని ఆయన విమర్శించారు. అందుకే తాము గంటకు 100 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో కారు నడపలేకపోతున్నామని తెలిపారు. అసోం ప్రజలు టోల్ ట్యాక్స్ చెల్లిస్తున్నప్పటికీ నాణ్యమైన రహదారులు పొందలేకపోతున్నారని ఆయన అన్నారు.

నితిన్ గడ్కరీ జోక్యం చేసుకోవడం వల్ల ఝాన్జీ ప్రాంతంలో రహదారులు మెరుగయ్యాయని, ఆ తర్వాత రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని గౌరవ్ గొగొయ్ అన్నారు.

ఎంపీ గౌరవ్ గొగొయ్ వ్యాఖ్యలపై నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. భారీ వర్షాల కారణంగా జాతీయ రహదారులు దెబ్బతిన్నాయని ఆయన అంగీకరించారు. గౌరవ్ గొగొయ్ చెప్పింది వాస్తవమేనని, దీనిపై విచారణ జరిపి రహదారులను పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నామని, ప్రస్తుతం పరిస్థితి మెరుగ్గా ఉందని ఆయన తెలిపారు.

Nitin Gadkari
Delhi Mumbai Expressway
Gaurav Gogoi
Lok Sabha
Expressway Speed

More Telugu News